Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 21 : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులు దంచికొట్టిన వానలు.. నాలుగో రోజు కాస్త తెరిపి ఇచ్చాయి. శుక్రవారం కొన్ని జిల్లాలో భారీగా, మరికొన్ని జిల్లా ఓ మోస్తరు వర్షాలు కురిశా యి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నా యి. చెరువులు, చెక్డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి. గురువారం భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహించిన గోదావరి శుక్రవారం కాస్త తగ్గింది. మొదటి ప్రమాద హెచ్చరికకు 43 అడుగుల దిగువన వరద పారుతున్నది. అయినా, భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తం గా 110 ముంపు గ్రామాల ప్రజలను 70 పునరాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ప్రత్యేకాధికారులు భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. భద్రాచలంలో వరద పరిస్థితులపై మంత్రి అజయ్కుమార్ సమీక్ష నిర్వహిస్తూ ఉండగా.. సీఎం కేసీఆర్ మంత్రికి కాల్ చేశారు. ముంపువాసులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద తగ్గుముఖం పట్టేంతవరకు ప్రజల మధ్యే ఉండాలని సూచించారు. అధికారులు సమన్వయం తో పనిచేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వానలకు జలమయమైన మహబూబ్నగర్లోని గణేశ్నగర్లోని ఎర్రకుంట, రామయ్యబౌళి నాలాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. వరద కారణం గా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందకుర్తి శివారులోని త్రివేణి సంగం వద్ద గోదావరి హైలెవెల్ వంతెనను ఆనుకుని ప్రవహిస్తున్నది. కందకుర్తి పుష్కర ఘాట్ల వద్ద గల పురాతన శివాలయం నీట మునిగింది. మంజీర ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. కందకుర్తి మీదుగా ధర్మాబాద్ , హైదరాబాద్ వైపు రాకపోకలు సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో పాత ఇండ్లు నేలకూలాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. దామరచర్ల మండలంలో చేపలు పట్టేందుకు వెళ్లి మూసీ వరదలో చిక్కుకున్న ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి, పెద్దవాగు, మోయెతుమ్మెద వాగు లు నిండుగా ప్రవహిస్తున్నాయి. మత్తడుల వద్ద ప్రజలు చేపల వేట కొనసాగిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గిన్నెరా పరిధిలోని తోయగూడకు చెందిన రంభాబాయి(56) అనారోగ్యంతో రిమ్స్లో శుక్రవారం మృతి చెందింది. గ్రామ పరిధిలోని మర్కాగూడ వాగు ఉప్పొంగడంతో వాగు అవతల అంబులెన్స్ నిలిచిపోయింది. మర్కాగూడ గ్రామస్థులు, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత సహకారంతో ఎడ్లబండిని వాగు వరకు తీసుకొచ్చారు. మృతదేహం తడవకుండా కుటుంబసభ్యులు గొడుగుల సాయంతో రంభాబాయి మృతదేహాన్ని ఎడ్లబండి ద్వారా వాగును దాటించారు.
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శనివారం కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు జారీచేసింది.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగంకలాన్కు చెందిన బొక్తంపల్లి పెంటప్ప (44) వరద ఉధృతికి శుక్రవారం కొట్టుకుపోయాడు. తాండూరు నుంచి స్వగ్రామానికి గ్రామస్థులతో బయలుదేరాడు. గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా గ్రామస్థులు అక్కడ ఆగారు. తోటి గ్రామస్థులు వారించినా వినిపించుకోకుండా పెంటప్ప వాగు దాటబోయి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. రాత్రి 9 గంటల వరకు వాగు చుట్టుపక్కల వెతికినా ఆయన ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు.