న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా పంజా విసిరింది. ఈ మహమ్మారి అదుపునకు జాతీయ స్థాయిలో అమలు చేసిన లాక్డౌన్.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) జీడీపీని పాతాళంలోకి దిగజార్చింది. ఏకంగా నాలుగు దశాబ్దాలకుపైగా కనిష్ఠానికి పతనమవుతూ మైనస్ 7.3 శాతంగా నమోదైంది. ఈ మేరకు సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2019-20) భారత వృద్ధిరేటు 4 శాతంగా ఉన్నది. అయితే కొవిడ్-19 నేపథ్యంలో వచ్చిపడిన ఆంక్షలు అటు ఉత్పత్తిని, ఇటు వినిమయాన్ని దెబ్బతీయగా, ఆ ప్రభావం.. జీడీపీ గణాంకాలపై స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ ఊహించిన దానికంటే కాస్త మెరుగ్గానే జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. 2020-21 జీడీపీ మైనస్ 8 శాతంగా ఉండొచ్చని ఎన్ఎస్వో, మైనస్ 7.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గతంలో అంచనా వేశాయి. ఇక పలు ఇతర రేటింగ్ ఏజెన్సీలు దాదాపు మైనస్ 10 శాతంగా చెప్పిన సంగతి విదితమే.
క్యూ4లో 1.6% వృద్ధి
గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, ఈ ఏడాది తొలి త్రైమాసికమైన జనవరి-మార్చిలో దేశ జీడీపీ 1.6 శాతం వృద్ధిని కనబర్చింది. గతేడాది జనవరి-మార్చిలో 3 శాతంగా నమోదైంది. కాగా, నిరుడు అక్టోబర్-డిసెంబర్లో 0.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో జీడీపీ మైనస్కే పరిమితమవగా, మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు వచ్చింది కేవలం ద్వితీయార్ధంలోనే. అలాంటిది ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్.. భారత్ను కుదిపేస్తుండగా, తిరిగి వచ్చిపడిన లాక్డౌన్లతో మరోసారి ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే 2020 తరహాలో సంపూర్ణ లాక్డౌన్లు లేకపోవడం కొంతలోకొంత ఊరటగా నిలుస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రాణాలకు, ఆర్థిక వ్యవస్థకు సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయని అంటున్నారు.
ప్రస్తుత ధరల ప్రకారం 2020-21లో భారత జీడీపీ విలువ రూ. 197.46 లక్షల కోట్లు (2.8 లక్షల కోట్ల డాలర్లు)గా ఉన్నది. 2019-20లో ఇది రూ. 203.51 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో ఏడాదిలో 3 శాతం క్షీణించినైట్లెంది. కాగా, 2011-12 ధరల ప్రకారం 2020-21లో దేశ జీడీపీ విలువ రూ.135.13 లక్షల కోట్లుగా ఉన్నట్లు జాతీయ గణాంకాల శాఖ చెప్తున్నది. 2019-20లో రూ. 145.69 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయికి ఎకానమీ చేరుకోవాలంటే 10-11 శాతం వృద్ధిరేటు తప్పనిసరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక 2011-12 ప్రకారం ఈ జనవరి-మార్చి జీడీపీ విలువ రూ.38.6 లక్షల కోట్లుండగా, గతేడాది జనవరి-మార్చిలో 38.33 లక్షల కోట్లుగా ఉన్నది.
జీడీపీ అంటే?
నిర్ణీత వ్యవధి (త్రైమాసికం లేదా ఆర్థిక సంవత్సరం)లో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు, సేవల అంతిమ ద్రవ్య విలువనే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)గా పరిగణిస్తున్నాం.
ఎలా లెక్కిస్తారు?
ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములైన వినియోగదారులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వాల రాబడి, వ్యయం ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. జీడీపీ=వినియోగం+పెట్టుబడులు+ప్రభుత్వ వ్యయం+నికర ఎగుమతులు.
దేన్ని సూచిస్తుంది?
దేశ ప్రగతికి జీడీపీనే కొలమానం. జీడీపీ గణాంకాలు ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లు. అన్ని రంగాలు ముందుకు వెళ్తున్నట్లే. అదే తక్కువగా ఉంటే కొనుగోళ్లు, ఉత్పత్తి మందగమనంలో పడినట్లే.
జీడీపీ ఎన్ని రకాలు?
జీడీపీ 4 రకాలు. రియల్ జీడీపీ, నామినల్ జీడీపీ, ఆక్చువల్ జీడీపీ, పొటెన్షియల్ జీడీపీ.
‘దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండంకెల జీడీపీ అంచనా కష్టమే’ -కేవీ సుబ్రమణ్యన్, ప్రధాన ఆర్థిక సలహాదారు