అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
జడ్చర్ల టౌన్, మే 6 : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్పారు. గురువారం జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అనుమతి ఉన్న వారు మాత్రమే లోపలికి వచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పాల్గొనే కౌన్సిలర్లు, గ్యాలరీల ఏర్పాట్లు, అదే విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, మీడియా, తదితర విషయాలపై ఆయన స్థానిక అధికారులతో చర్చించారు. కొవిడ్ దృష్ట్యా కేవలం కౌన్సిలర్లు, అవసరమైన అధికారులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.