హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వైద్య సహాయానికి సంబంధించి రాష్ర్టానికి వాస్తవంగా రావాల్సిన కోటాను కేంద్రం ఇవ్వకపోయినా మాట్లాడని కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఇతర రాష్ట్రాల రోగులకు తెలంగాణలో అనుమతిపై ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నది. పొరుగు రాష్ర్టాల నుంచి వైద్యంకోసం వస్తున్న అంబులెన్స్ను రాష్ట్ర సరిహద్దులో ఆపటం సంప్రదాయం కాదని వ్యాఖ్యానిస్తున్న కిషన్రెడ్డి.. ఇతర రాష్ర్టాల నుంచివస్తున్న రోగుల తాకిడితో తెలంగాణపై వత్తిడి తీవ్రంగా పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించారా? ఇతర రాష్ర్టాలవారికి వైద్యం అందించడం తెలంగాణకు కొత్తేమీ కాదు.. విదేశాల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకున్నవారూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాలకు చెందినవారే 40% నుంచి 45% వరకూ ఉంటున్నారు. కానీ.. కేంద్రం కేటాయింపులు మాత్రం తెలంగాణలో నమోదైన కేసుల ప్రాతిపదికనే ఉంటున్నాయి. అంటే.. సాధారణ పరిస్థితికంటే ఆ మేరకు అధికంగా రోగులు తెలంగాణలో చికిత్స పొందుతున్నా.. ఆక్సిజన్, రెమ్డెసివిర్, ఇతర ఔషధాల కోటా మాత్రం పెంచలేదు. ఒక బాధ్యతాయుతమైన కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి చేయాల్సింది ఉచిత సలహాలు ఇవ్వడం కాదు.. తెలంగాణపై పెరిగిన వత్తిడి మేరకు కేంద్రం నుంచి కేటాయింపులు పెంచాలి. కానీ.. ‘సుద్దులు చెప్తాం తప్పించి.. బాధ్యత వహించం.. పత్రికల్లో పేరు కనిపించడం కోసమే మాట్లాడుతాం’ అంటే మాత్రం కేంద్రమంత్రి స్థాయికి సరిపోదు.