హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో వైద్యారోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్యరంగాన్ని మరింత పటిష్ఠం చేయడం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో నిధులు ప్రతిపాదించింది. ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమం స్టేట్ సెక్టార్ పథకాలకు రూ.192.33 కోట్లు కేటాయించింది. ఇందులో ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రూ.20 కోట్లు, నిమ్స్కు రూ. 3.67 కోట్లు, ఎంఎన్జే దవాఖాన రీజినల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్కు మొత్తం రూ.239.99 కోట్లు, 5 టీచింగ్ దవాఖానల ఏర్పాటుకు రూ.36 కోట్లు కేటాయించింది. టిమ్స్కు రూ.2 కోట్లు, మెడికల్ కాలేజీలకు రూ.120 కోట్లు, నర్సింగ్ కాలేజీలకు రూ.28 కోట్లు ప్రతిపాదించింది. ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్కు రూ.40 కోట్లు కేటాయించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగానికి రూ.262.65 కోట్లు ప్రతిపాదించింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు రూ.439 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రధానంగా కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడికి రూ.329.91 కోట్లు ప్రతిపాదించింది. 102 సర్వీసుల కోసం రూ.15 కోట్లు, మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు ఉపయోగించే హర్సే వాహనాల కొనుగోలుకు రూ.5 కోట్లు, 104 సేవల కోసం రూ.36 కోట్లు కేటాయించింది. ఆయుష్ కోసం రూ.23.60 కోట్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కోసం రూ.129 కోట్లు ప్రతిపాదించింది.