హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సాగుకు సాంకేతికత తోడైయితేనే ఎవుసం పండుగవుతుంది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్న ప్రభుత్వం, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లో పెట్టుబడిని తగ్గించి, నాణ్యమైన ఉత్పత్తులను రాబట్టే లక్ష్యంతో ‘సాగు.. బాగు’ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నది. దేశంలో మొ దటిసారి పబ్లిక్ ప్రైవేటు కో-ఆపరేషన్ (పీపీసీ) పద్ధతిలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, పలు ప్రైవేటు స్టార్టప్ కంపెనీలతో కలిసి ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీశాఖ రూపకల్పన చేసింది. ఇం దులో 70కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పాలుపంచుకోనున్నాయి. వ్యవసాయ సమ స్యల పరిష్కారానికి అధికారులు ఇప్పటికే 30 కీలక టెక్నాలజీలను ఎంపికచేశారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఐవోటీ, రిమో ట్ సెన్సింగ్, బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీలతో వ్యవసాయానికి కొత్తరూపు ఇవ్వనున్నారు.
ఐదు జిల్లాలు.. ఐదు పంటలు
సాగు-బాగును వచ్చే యాసంగి సీజన్ నుంచి ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెండేండ్లపాటు చేపట్టనున్నారు. వానాకాలంలో పత్తి, మిరప, పసుపు, యాసంగిలో వేరుశనగ, శనగ పంటలపై పరిశోధన చేయనున్నారు. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో పత్తి, వేరుశనగ, శనగపై నాగర్కర్నూల్, పసుపు పంటపై జగిత్యాల, మిరపపై ప్రయోగానికి ఖమ్మం జిల్లాను ఎంపికచేశారు. ఐదు జిల్లాల్లోని వెయ్యి గ్రామాల్లో లక్ష మంది రైతులను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేస్తారు. 100 ఎఫ్పీవోలు, రైతు గ్రూపులు కూడా ఇందులో పాలుపంచుకొంటాయి.
ఏం చేస్తారు?
దుక్కి నున్నటం నుంచి పంటను మార్కెట్లో అమ్మే వరకు ప్రతి దశలోనూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, పెట్టుబడి ఖర్చును తగ్గించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. మృత్తికా పరీక్ష, విత్తనం ఎంపిక, నారు సంరక్షణ, పంటపై దాడిచేసే చీడపీడలను ముందుగానే గుర్తించటం, ఎరువుల ఎంపిక, అతి తక్కువ పురుగుమందులతో చీడపీడల నివారణ, ఆధునిక పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించటం, పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవటం వంటి అంశాల్లో రైతులకు శిక్షణ ఇస్తారు. వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలన్నదానిపై దృష్టిపెడుతారు.