సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలో దివ్యాంగులను గుర్తించి.. 5 లక్షల మందికి పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. బుధవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ ప్రభుత్వం ఉపకరణాలు అందిస్తున్నదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇస్తున్నామని, ఇందులో కేంద్రం వాటా కేవలం 1.80 శాతం మాత్రమేనని చెప్పారు. అనంతరం దివ్యాంగులతో కలిసి మంత్రులు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.