ముంబై : కరోనాపై యుద్ధం జరుగుతోందని.. రాజకీయాలు చేసేందుకు ఇదేం ఇండో-పాక్ యుద్ధం కాదని శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్రసింగ్ ఫడ్నవిస్ ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు లాక్డౌన్ కోరుకోవడం లేదని తమకూ తెలుసునని.. కానీ, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పరిష్కారం ఏంటని? ప్రశించారు.
ఢిల్లీలో కూర్చున్న ప్రకాశ్ జవదేకర్ మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దని, మహారాష్ట్రకు వచ్చి పరిస్థితిని చూడాలన్నారు. ఆయనకు రాష్ట్రంతో సంబంధముందని, దీన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాకే శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్త లాక్డౌన్పై చర్చ జరిగింది. ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ అమలులో ఉంది. వైరస్ కట్టడికి మూడువారాల పాటు కఠిన చర్యలు అవసరమని సీఎం ఠాక్రే స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ లాక్డౌన్ ఆమోదయోగ్యమైన చర్య అని అన్నారు. లాక్డౌన్ తప్ప మారే మార్గం లేదని.. కేసులు కేసులు మహారాష్ట్రకు మాత్రమే పరిమితం కాదని.. దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయన్నారు. దేశానికి లాక్డౌన్ అవసరమా? కాదా? అనేది ప్రధాన మంత్రే నిర్ణయించగల విషయమని, పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. టీకా డ్రైవ్, స్టాక్ పెంపు కేంద్రం బాధ్యతేనని స్పష్టం చేశారు. మహారాష్ట్ర టీకాల కొరతను ఎదుర్కొంటుందని అన్నారు.