దార్శనికుడి స్ఫూర్తిని చాటి చెప్పారు
శతజయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు
పీవీ ఘనతపై ఆవహించిన మబ్బులు ఉత్సవాలతో తొలిగాయి
సీఎం కేసీఆర్కు పీవీ ప్రభాకర్ రావు కృతజ్ఞతలు
హైదరాబాద్ : మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలం పాటు ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పీవీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన సీఎం కేసీఆర్ను పీవీ తనయుడు పీవీ ప్రభాకర్ రావు ప్రశంసించారు. పీవీ శతజయంతి ముగింపు ఉత్సవాలు పీవీ జ్ఞానభూమిలో జరిగాయి. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో26 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
నవభారత నిర్మాత, నిత్య సంస్కరణశీలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఖ్యాతిని నేటి తరానికి తెలిపిన, భవిష్యత్ తరాలు తెలుసుకునేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని పీవీ ప్రభాకర్ రావు అన్నారు. పీవీ మన ఠీవీ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన శత జయంతి ఉత్సవాలతో.. చరిత్రకు ఆవహించిన మబ్బులు తొలగిపోయినట్టు అయిందని అభివర్ణించారు. శతజయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కె.కేశవరావు పెద్దన్నలా కార్యక్రమాల్ని ముందుండి నడిపించారని అన్నారు. కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించడం వల్ల తన వంతు బాధ్యతను నిర్వహించేందుకు దోహపడిందని తెలిపారు.
దేశ విదేశాల్లోని పీవీ అభిమానులను, తెలుగు వాళ్లను, భారతీయుల్ని వేడుకల్లో భాగస్వాములు చేయడం అభినందనీయమని చెప్పారు. దేశవ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల నుంచి ఎంతో మంది స్వచ్ఛందంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం, పీవీ ఖ్యాతి గురించి మాట్లాడటం గొప్ప విషయమని అన్నారు. విశ్వమానవుడి ఖ్యాతిని ఈ తరం తెలుసుకునేందుకు ఉత్సవాలు వేదికగా మారాయని పీవీ ప్రభాకర్ రావు అన్నారు.
పీవీని 360 డిగ్రీల కోణంలో ఆవిష్కరించడమే లక్ష్యంగా సాగిన ఉత్సవాలు.. సంతృప్తిని మిగిల్చాయని ప్రభాకర్ రావు అన్నారు. పీవీ రచనల్ని, పీవీపై రాసిన రచనల్ని ప్రభుత్వం ముద్రించడం అభినందనీయమన్నారు. పీవీ సమకాలీన నేతలు, రచయితలు, జర్నలిస్ట్ లు ఎందరో పీవీ పాలనాదక్షతను వివరిస్తూ అద్భుత రచనలు చేశారని అన్నారు. తమ అనుభవాల్ని పంచుకున్నందుకు, అభిమానాన్ని చాటుకున్నందుకు సంతోషంగా ఉందని పీవీ ప్రభాకర్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీవీపై ప్రేమను చాటిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హుస్సేన్ సాగర తీరంలో పీవీ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు, నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ అని నామకరణం ద్వారా తెలంగాణ ప్రభుత్వం… నిజమైన నివాళి అర్పించిందని అన్నారు. పీవీ ఘనతను ఈ తరానికి, భవిష్యత్ తరాలకు తెలియచేసేందుకు శతజయంతి ఉత్సవాలు ఆరంభం మాత్రమేనని.. ఇంకా ఎంతో చేయాల్సి ఉందని ప్రభాకర్ రావు తెలిపారు.