18 వరకు స్వీకరణ
రెండు చోట్ల పటిష్ట ఏర్పాట్లు
పరిశీలించిన కలెక్టర్, కమిషనర్
వరంగల్, ఏప్రిల్ 15: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుండగా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్, ఎల్బీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ సెంటర్లను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, డీసీపీ పుష్ప గురువారం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండు సెంటర్లలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎల్బీ కళాశాలలో 32 డివిజన్లు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 34 డివిజన్ల నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఒక్కో డివిజన్కు ఒక్కో గదిని కేటాయించామన్నారు. ప్రతి గదికి ఒక్క వీడియో గ్రాఫర్ను నియమిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఏసీపీలు ఉన్నారు.
కంప్యూటర్లు, ఇతర సామగ్రి తరలింపు
నామినేషన్ల స్వీకరణకు కావాల్సిన కంప్యూటర్లు, ఇతర సామగ్రిని గ్రేటర్ అధికారులు నామినేషన్ల కేంద్రాలకు తరలించారు. జనరల్కు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2500 నామినేషన్ ఫీజు తీసుకోనున్నారు. స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంతా ఆయా కేంద్రాల్లోనే పూర్తి చేయనున్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 29, 30, 31, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66 డివిజన్లకు సంబంధించి, ఎల్బీ కళాశాలలో 1, 2, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44 డివిజన్ల నామినేషన్లను స్వీకరించనున్నారు.