నిర్మాణానికే పరిమితమై.. పని చేయని మురుగునీటి శుద్ధి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్ను కొనసాగిస్తున్నది. దాదాపు 68 శాతం ఎస్టీపీలు పని చేస్తుండగా.. వివిధ కారణాలతో మిగిలినవి అందుబాటులోకి రాలేదని ఆడిట్లో తేలింది. దీంతో మురుగునీటిని నిర్లక్ష్యంగా వదిలివేసే ఎస్టీపీల నిర్వాహకులపై చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న మురుగును శుద్ధి చేసేందుకు పలు ప్రాంతాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పెద్ద ఎత్తున నివాస సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు ఎస్టీపీలను ఏర్పాటు చేసుకొని మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటికి వదలాలని నిబంధనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రికార్డుల ప్రకారం నగరంలో 628 ప్రైవేటు ఎస్టీపీలు ఉన్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టిన దాఖలాలు లేవు.
హెచ్ఎండీఏ పరిధిలోని ప్రైవేటు ఎస్టీపీలపై తొలిసారిగా పురపాలక శాఖ ఆడిట్ చేపట్టడం విశేషం. వాస్తవంగా ఎస్టీపీలు పని చేస్తున్నాయా? లేవా? ఒక వేళ అవి పని చేస్తే ఆ నీటిని తిరిగి ఎలా వినియోగిస్తున్నారు? అనే అంశాలను తేల్చేందుకు ఈ ఆడిట్ చేపట్టారు. ఈ మేరకు రికార్డుల్లో ఉన్న 68 శాతం ఎస్టీపీలు ప్రస్తుతం పని చేస్తున్నట్లుగా తేలింది.