సారంగాపూర్, ఏప్రిల్ 20: భూ రిజిస్ట్రేషన్ కోసం జగిత్యాల జిల్లా బీర్పూర్ తాసిల్ కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తి ఆటో నుంచి దిగి రాలేని స్థితిలో ఉండటంతో తాసిల్దార్, సిబ్బందే ఆటో వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. బీర్పూర్ మండలం కండ్లపల్లికి చెందిన దోసారపు మల్లయ్య ఇదే గ్రామానికి చెందిన మాంకాళి రాజన్నకు రెండు ఎకరాల 26 గుంటల భూమిని విక్రయించారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు తాసిల్ కార్యాలయం వద్దకు ఆటోలో వచ్చారు. అతని పరిస్థితిని తెలుసుకున్న తాసిల్దార్ ఆరిఫొద్దీన్, కార్యాలయ సిబ్బంది వచ్చి సంతకాలు, ఫొటో, వివరాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. అధికారుల చొరవను పలువురు ప్రశంసించారు.