హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ)/ గోల్నాక: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలే స్ఫూర్తిగా రాష్ట్రంలో బీసీవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన గంగుల.. అనంతరం గురుకుల విద్యార్థులతో వెబినార్ నిర్వహించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. పూలే ఆశయాలు నిజంచేసేలా ప్రభుత్వం బీసీ సంక్షేమానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. విద్యాసంస్థలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. దేశంలో రూ.100 కోట్లతో 82 ఎకరాల్లో 30 బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సగ్వరంగా ప్రకటించారు. త్వరలో కేసీఆర్ ఆపద్బంధు, కేసీఆర్ మహిళా చేతన, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు, రజకుల దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం ద్వారా వెనుకబడిన అన్నికులాల సముద్ధరణకు ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెట్రకరీ బుర్రా వెంకటేశం, జ్యోతిరావుపూలే గురుకుల విద్యాలయాల కార్యదర్శి మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ ఎండీ బాలాచారి తదితరులు పాల్గొన్నారు.
సమాజంలో అంతరాలు తొలగటమే మహాత్మజ్యోతిరావుపూలే, అంబేద్కర్ వంటి మహనీయులకు నిజమైన నివాళి అని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లోని అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద పూలే విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అంబర్పేటలో పూలే ఆడిటోరియం, ఆయా ప్రాంతాల్లో పూలే విగ్రహాలు ఏర్పాటు తదితర అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
సమసమాజ స్థాపన కోసం పోరాడిన బహుజన తత్వవేత్త మహ్మాతాజ్యోతిరావు పూలే అని సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. ఆదివారం మహబూబ్నగర్ లో పూలేకు నివాళులర్పించారు. సమాజానికి పూలే అందించిన సేవలు ఎనలేనివని ఆయన తపేర్కొన్నారు. కుల, లింగవివక్షకు తావులేకుండా విద్య, సమానత్వంతోనే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడుతాయనే పూలే ఆలోచనలనే సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని శ్రీనివాస్గౌడ్ చెప్పారు.