అట్లాంటాలో స్థల పరిశీలన
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోని ఐదు దేశాల్లో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడు బిగాల మహేశ్ గుప్తా ఆధ్వరంలో అమెరికాలోని అట్లాంటాలో పీవీ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు అట్లాంటాలోని భారతీయ, తెలుగు సంస్థల ప్రతినిధులు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మహేశ్ గుప్తా మాట్లాడుతూ.. పీవీ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావుతో చర్చించి నవంబర్లో విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. అట్లాంటాలో గాంధీ విగ్రహాన్ని ఏ ర్పాటు చేశామన్నారు. విగ్రహ ఆవిష్కరణకు తెలంగాణ నుంచి ప్రముఖులను, పీవీ కుటుంబసభ్యులను ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఐఏసీఏ వ్యవస్థాపక సభ్యుడు పాడిశర్మ ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, అమెరికన్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చాంద్ అక్కినేని, ఐఎఫ్ఏ చైర్మన్ సునీల్ సవిలి, టీఆర్ఎస్ పార్టీ అట్లాంటా సలహాదారు రామడుగు శివకుమార్, జనార్దన్ పన్నెల, సందీప్ గుండ్ల, గణేశ్, శ్రీనివాసులు రామిశెట్టి, కీర్తిధర్ గౌడ్ చకిలం పాల్గొన్నారు.