హైదరాబాద్, జూలై 4 (నమస్తేతెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులపై ఎవరైతే రాళ్లతో కొట్టమంటున్నారో.. వాళ్లనే ప్రజలు రాళ్లతో కొడతారని స్పష్టంచేశారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడని, మొదటగా పార్టీ మారిన రేవంత్నే ప్రజలు రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. స్పీకర్కు దొంగ పత్రాలు ఇచ్చి వచ్చిండని మండిపడ్డారు. ఎక్కడ వెంచర్లు వేసినా, బిల్డింగులు కట్టినా అక్కడ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.వేలకోట్లు దండుకుంటున్నాడని ఆరోపించారు. స్థాయికి మించి మాట్లాడితే ప్రజలు పిచ్చికుక్కను కొట్టినట్టు కొడతారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. దళిత సాధికారత పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిసుస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో సాహసోపేతంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి దళిత సమాజానికి కొండంత ధైర్యానిచ్చారని శ్లాఘించారు. దళిత సాధికారత పథకం పట్ల హర్షంవ్యక్తం చేస్తూ నకిరేకల్ నియోజకవర్గ దళిత సంఘాల ఆధ్వర్యంలో నకిరేకల్ నుంచి హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వరకు కృతజ్ఞతా పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే లింగయ్య ప్రసంగిస్తూ.. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను తలెత్తుకుని బతికేలా చేసిన సీఎం కేసీఆర్ యావత్ దేశానికే దిక్సూచిలా నిలిచారని కొనియాడారు.