హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సున్నా అడ్మిషన్ల కారణంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ ఒక్క ఏడాదే 212 బడులు మళ్లీ తెరుచుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 26,067 ఉండగా.. 1,201 బడుల్లో విద్యార్థులు చేరకపోవడంతో వీటిని మూసివేశారు. ఆయా పాఠశాలలు తెరిపించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేశారు. అధికారులతోపాటు టీచర్లు సైతం ప్రత్యేక చొరవ తీసుకోగా మూతబడ్డ పాఠశాలలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.
విద్యార్థులు ప్రవేశాలు పొందుతుండటంతో సెప్టెంబర్ మొదటివారం వరకు 94 బడులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే మరో 118 పాఠశాలు తెరుచుకోవడం గమనార్హం. వీటిల్లో గతంలో ఒక్కరు కూడా చేరకపోగా.. ఇప్పుడు 3,500 పైచిలుకు విద్యార్థులు చేరారు. రాష్ట్రంలో సున్నా అడ్మిషన్లు నమోదైన పాఠశాలల సంఖ్య సైతం క్రమంగా తగ్గుతూ 989కి చేరుకున్నది. త్వరలోనే మరికొన్ని పాఠశాలలు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
ప్రైవేట్ నుంచి సర్కారుకు 2.20 లక్షల మంది
ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్ల్లో చేరేవారి సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 2.20 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వీడి సర్కారు బడుల్లో చేరారు. ఆగస్టు మొదటివారంలో 1.14 లక్షల మంది ప్రైవేట్ స్కూళ్లను వీడగా, అక్టోబర్ మొదటివారం వరకు వీరి సంఖ్య 2.20 లక్షలకు చేరుకున్నది. వాస్తవానికి మరికొందరు సర్కారు బాట పట్టినా.. ఆయా విద్యార్థుల పేర్లను చైల్డ్ ఇన్ఫో నుంచి ప్రైవేట్ స్కూళ్లు తొలగించడంలేదు. దీంతో సమస్యలు తలెత్తుతున్నందున మంగళవారంలోగా చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలను నమోదుచేయాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీచేశారు.