మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
హాజీపూర్, మార్చి 22 : ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా అమలు చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో సోమవారం జిల్లా సహకార, పౌర సరఫరాల, జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, హమాలీ సంఘం నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ యార్డు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం వాహనాలు, హమాలీ కూలి ధరలను నిర్ణయించామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన ధరలను తప్పకుండా అమలు చేయాలని సూచించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం, సంచులు నింపుట, సంచిని నింపి కాంటాపై పెట్టుట, సంచి కుట్టి లోడింగ్ చేయడం కలిపి రూ.30 ధర నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ ధరలను తప్పని సరిగా అమలు చేయాలని, ఎవరైనా నిర్ణయించిన ధరలకు మించి తీసుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ గోపాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్, కార్మిక శాఖ అధికారి రఫీక్, డీసీఎంఎస్ అధికారులు సంతోష్, రైతు ప్రతినిధులు, హమాలీ సంఘం నాయకులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.