వచ్చే నెల 1 నుంచి పంపిణీ
4-8 వారాల మధ్యలో రెండోడోస్
దేశంలో వ్యాక్సిన్లకు కొరత లేదు
కేంద్రమంత్రి జవదేకర్ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 45 ఏండ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. 45 ఏండ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు కూడా ఇకపై టీకా వేయించుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి వారందరూ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వైద్య నిపుణుల సూచనలను అనుసరించి టీకా రెండో డోసును 4-8 వారాల మధ్యలో ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పారు. ఇంతకుముందు 4-6 వారాల మధ్యలో రెండో డోసు వేస్తుండగా, మెరుగైన ఫలితాల కోసం ఈ వ్యవధిని 4-8 వారాలకు పెంచినట్టు వివరించారు.
ఇప్పటివరకు 4.8 కోట్ల మందికి టీకా
దేశంలో ఇప్పటివరకు 4.8 కోట్ల మందికి టీకా ఇచ్చినట్టు జవదేకర్ వెల్లడించారు. దేశంలో తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టంచేశారు. పంజాబ్లో నమోదైన కొత్త కేసుల్లో 80 శాతం బ్రిటన్ రకానికి చెందినవే ఉండటంపై విలేకరులు ప్రశ్నించగా.. వైరస్ రూపు మార్చుకుని వస్తున్నదని, అందుకే వ్యాక్సిన్ వేసుకోవడం ముఖ్యమని చెప్పారు. అలాగే కరోనా మార్గదర్శకాలను కూడా పాటించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే.
వేగంగా వ్యాక్సినేషన్ కరోనా టెస్టులను భారీగా చేపట్టండి: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేసుల గుర్తింపునకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలన్నది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ప్రధానాంశాలు..
మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్?
లాక్డౌన్ విధించే యోచనలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. గత వారం రోజుల్లో సగటున ఆ రాష్ట్రంలో పాతిక వేలు చొప్పున కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం లేదా ప్రధాన నగరాల్లో లాక్డౌన్ ఆంక్షలు విధించే అవకాశమున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మరోవైపు, ఇప్పటికే ముంబై, పుణె వంటి నగరాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్నదని, అయితే దీనివల్ల కేసుల కట్టడి సాధ్యమవ్వడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. వైరస్ నియంత్రణకు లాక్డౌన్ విధించడమే సరైన నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న పర్భణీ జిల్లాలో అధికారులు లాక్డౌన్ విధించారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి మార్చి 31 వరకు లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,715 కేసులు నమోదయ్యాయి.