హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని తార్నాక ప్రాంతానికి చెందిన శంకర్ ఇటీవల కరోనాతో మరణించారు. అప్పటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.3 లక్షలు ఉన్నాయి. ఆయన పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్లు, స్థిర, చరాస్తులు ఉన్నాయి. శంకర్కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఆస్తులు పంచుకునే క్రమంలో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ.. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పైగా అన్నదమ్ముల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితులను చూసిన శంకర్ సోదరుడు ముందు జాగ్రత్తగా వీలునామా రాసి రిజిస్టర్ చేయించారు. కరోనా కారణంగా రాబోయే పరిస్థితులను ఎవరూ ఊహించలేకపోతున్నారు. దీంతో తమ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ముందుగానే వీలునామాలు రాస్తున్నారు. కరోనా మొదటివేవ్ సమయంలోనే ఈ పరిణామం మొదలైనా.. సెకండ్వేవ్ తీవ్రంగా రావడం, ఆరోగ్యవంతులు సైతం హఠాత్తుగా మృతిచెండం, మరణాల సంఖ్య అంచనాలకు మించి ఉండటం తదితర కారణాలతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. మరోవైపు ఒక వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆస్తుల పంపకాల విషయంలో వారసులు నానా అవస్థలు పడుతుండటాన్ని గమనిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తుగా 40 ఏండ్ల వయసులోనే వీలునామా రాయడం మంచిదని ఆలోచిస్తున్నారు.
చిన్న వయసులోనే ముందు జాగ్రత్త
గతంలో 55 ఏండ్లకు పైబడినవారు వీలునామాలు రాసేవారు. కరోనా తర్వాత మధ్యవయస్కులు సైతం వీలునామాలు రాస్తున్నారు. ఆరోగ్యవంతులను సైతం కరోనా కబళిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ‘40 ఏండ్లవారు కూడా ముందుజాగ్రత్తగా ఈ-వీలునామాలు రాస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ‘గతంలో మా క్లయింట్ల సగటు వయసు 55 ఏండ్లు.. ఇప్పుడు అది 45 ఏండ్లకు తగ్గింది. 30 ఏండ్లున్న వ్యక్తులు సైతం మమ్మల్ని సంప్రదించిన సంఘటనలు ఉన్నాయి’ అని లారాటో.కామ్ ఎండీ రోహన్ మహాజన్ తెలిపారు. వీలునామాను వ్యక్తి బతికున్నంత కాలం ఎన్నిసాైర్లెనా మార్చుకునే అవకాశం ఉన్నది. దీంతో చాలా మంది కరోనా విపత్తు ముగిసేవరకు తాత్కాలిక పద్ధతిలో వీలునామాలు రాస్తున్నారు.
పక్కాగా రాయాలి
సాధారణంగా ఒక వ్యక్తి తన స్వార్జితంతో కూడబెట్టిన ఆస్తులను తన వారసులకు లేదా సంస్థలకు లేదా ప్రభుత్వానికి ఎంత వాటా ఇవ్వాలో ముందస్తుగా రాసిపెట్టే చట్టబద్ధమైన పత్రాన్ని వీలునామా అంటారు. విల్లు రాసే వ్యక్తిని ‘టేస్టేటర్’ అని పిలుస్తారు. టేస్టేటర్ తన ఆస్తులు, అప్పులు, చెల్లింపులు.. ఇలా దేనినీ వదిలేయకుండా రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే వీలునామా రాసి ఉంటే.. పాతదానికి బదులుగా దీన్ని రాస్తున్నట్టు స్పష్టంగా చెప్పాలి. వారసులు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వాటా ఇవ్వొద్దని భావిస్తే ఎందుకు ఇవ్వకూడదని అనుకుంటున్నారో వివరిస్తే మంచిది. చివరగా వీలునామాను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేయిస్తే చట్టబద్ధత ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.