టైంకు మందులు వేసుకొంటున్నవా? కరోనాకు భయపడకు. అదేం చెయ్యదు.. మీకేమీ కాదు.. నేనున్నా ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తా..
కేసీఆర్ జిందాబాద్..
కేసీఆరే నా నిండు ప్రాణం. కరోనా సోకితే కుటుంబ సభ్యులే దగ్గరకు రాని పరిస్థితి ఉన్నది.. అలాంటిది మా దగ్గరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రావటం నిజంగా గ్రేట్. సార్ రాకతో నాకు ఎంతో ధైర్యం వచ్చింది.
-వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషెంట్ వెంకటాచారి
ఆ దవాఖానలో వార్డులన్నీ కొవిడ్ రోగులతో నిండిపోయి ఉన్నాయి. వాటిలోకి కేవలం మాస్క్, ఫేస్షీల్డ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశించారు. తమను పరామర్శించేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రావడంతో అక్కడి రోగుల్లో ఒక విధమైన సంతోషం.. ముఖ్యమంత్రి తమతో నేరుగా మాట్లాడటంతో కొండంత ధైర్యం.. భయపడకండి.. మీకు నేనున్నా.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఇంటికి పంపే బాధ్యత నాది.. అని చెప్పడంతో ఎక్కడలేని ఉత్సాహం! కరోనా రోగులే కాదు.. వారికి చికిత్స చేస్తున్న వైద్యుల్లో, బాధితుల సేవలో నిమగ్నమైన వైద్య సిబ్బందిలో కొత్త స్ఫూర్తి!! ఇవీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వరంగల్ ఎంజీఎం దవాఖాన సందర్శన సందర్భంగా కనిపించిన దృశ్యాలు. కరోనా బాధితులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సాహసం చేశారు. మొన్నటికి మొన్న గాంధీ దవాఖానలో రోగులను పరామర్శించి.. వారిలో మానసిక ైస్థెర్యం నింపిన సీఎం.. ఇప్పుడు వరంగల్ ఎంజీఎం దవాఖానను సందర్శించారు. బాధితులతో నేరుగా మాట్లాడి, మనోనిబ్బరాన్ని ఇచ్చారు. ఆ నిబ్బరం ఎంతటిదంటే.. ఓ కరోనా బాధితుడు ‘కేసీఆరే నా నిండు ప్రాణం.. కేసీఆర్ జిందాబాద్..’ అని గట్టిగా నినదించేంత!!
వరంగల్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘అవ్వా! ఎట్లుంది ఆరోగ్యం? టైంకు మందులు వేసుకొంటున్నవా? కరోనాకు భయపడకు. అదేం చెయ్యదు.. ఏం బాబు.. మీది ఏ ఊరు? డాక్టర్లు మందులు ఇస్తున్నరా? దవాఖానకు వచ్చి ఎన్ని రోజులవుతున్నది?.. ఓ అమ్మా! దవాఖానల చికిత్స మంచిగా చేస్తున్నరా? ఇక్కడ సౌకర్యాలు బాగున్నయా?’ వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఒక్కో బెడ్ వద్దకు వెళ్లి రోగుల బాగోగులను సీఎం కేసీఆర్ తెలుసుకొన్న తీరు ఇది. మొన్ననే హైదరాబాద్ గాంధీ దవాఖానను సందర్శించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం వరంగల్లోని మహాత్మాగాంధీ స్మారక (ఎంజీఎం) దవాఖానను సందర్శించారు. హాస్పిటల్లోని ఒక్కో కరోనా పేషెంటు దగ్గరికి వెళ్లి ‘మీకేం కాదంటూ’ భరోసా కల్పించారు.
మూతికి మాస్క్, ముఖానికి ఫేస్ షీల్డ్ ధరించిన ముఖ్యమంత్రి రోగుల బాగోగులు తెలుసుకొని, అన్ని రకాలుగా తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. దవాఖానలో చికిత్స ఎలా ఉంది? డాక్టర్లు, వైద్యసిబ్బంది సరైన సేవలు అందిస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకొన్నారు. అందర్నీ పేరుపేరునా పలుకరించి ఊరు, వివరాలు అడిగారు.
వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. మధ్యాహ్నం 12.43 గంటలకు ఎంజీఎం దవాఖానకు చేరుకొన్నారు. నేరుగా వెంటిలేటర్ ఐసీయూ వార్డులోకి వెళ్లి 12 మంది కరోనా రోగులను పరామర్శించారు. ప్రతి బెడ్పై ఉన్న బాధితులతో మాట్లాడారు. అక్కడి నుంచి ఐసీయూ వార్డుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న 20 మందితో మాట్లాడారు. అనంతరం కరోనా వార్డుకు ఎదురుగా ఉన్న ట్రయాజ్ (జనరల్) వార్డును సందర్శించారు. కరోనా పరీక్షల శాంపిల్స్ పంపి, ఫలితాలు వచ్చేవరకు వార్డులోని 16 మంది రోగులతో ముచ్చటించారు. ప్రతి పేషెంట్ వివరాలు, ఎప్పుడు దవాఖానలో చేరారు? వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అని అడిగారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని డాక్టర్లను ఆరాతీశారు. తర్వాత ఎంజీఎం దవాఖాన అంతా కలియదిరిగి, అక్కడి సౌకర్యాలను పరిశీలించారు.
హాస్పిటల్లోని వైద్యసౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకొన్న సీఎం.. ఎంత ఖర్చయినా సరే రోగులకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం వెంట కరోనా వార్డులోకి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, సీఎస్ సోమేశ్కుమార్, వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ వీ చంద్రశేఖర్, సీఎం ఓఎస్డీ గంగాధర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ పవన్ వెళ్లారు.
ఎంజీఎంలో కలియదిరిగిన ముఖ్యమంత్రి అక్కడ 32 నిమిషాల పాటు 48 మంది బాధితులను పలుకరించారు. వైద్యసేవలపై పేషెంట్లు చెప్పిన విషయాలు సావధానంగా విన్నారు. వారు చెప్పిన సూచనలు, సమస్యలను నోట్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఖర్చుకు వెనుకాడబోవద్దని స్పష్టం చేశారు.
‘దవాఖానకు వచ్చి భవనాలకు శంకుస్థాపన చేసిన సీఎంలను చూశాం.. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే మంత్రులను చూశాం.. కానీ రోగులుండే వార్డుకు ఓ ముఖ్యమంత్రి రావటమా! అదీ కరోనా బాధితులున్న ఐసీయూ వార్డులోకి. క్లిష్ట సమయాల్లోనూ సీఎం కేసీఆర్ సాహసం చేశారు’ ఇదీ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం డాక్టర్లు, వైద్య నిపుణుల మధ్య జరిగిన సంభాషణ. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న వార్డులోకి సీఎం కేసీఆర్ వెళ్లి రోగుల్లో భరోసా నింపారని, ఆయనది గొప్ప ధైర్యమని డాక్టర్లు కొనియాడారు.
ఒక్కో బెడ్డ వద్ద రోగుల బాగోగులు తెలుసుకొంటూ ముందుకు కదిలిన సీఎం కేసీఆర్కు వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషెంట్ వెంకటాచారి తారసపడ్డారు. సీఎం తనను చూసి పలుకరించగానే ఉబ్బితబ్బిబ్బైన ఆయన ‘కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం’ అని బిగ్గరగా అరిచారు. ఒకవైపు కరోనా వైరస్ సోకి బాధపడుతున్నా, సీఎం వచ్చి తనను పలుకరించటంతో వెంకటాచారి తన అభిమానాన్ని ఇలా చాటుకొన్నారు. కుటుంబసభ్యులే దగ్గరకు రాని పరిస్థితి ఉన్నదని, సీఎం కేసీఆర్ రావటం నిజంగా గ్రేట్ అని అన్నారు. తనకు ఎంతో ధైర్యం వచ్చిందని చెప్పారు. 12 రోజులనుంచి చికిత్స పొందుతున్నానని ఆయన సీఎంకు చెప్పగా, ఆక్సిజన్ పల్స్ రేటు తక్కువగా ఉండటం వల్ల సమయం పడుతున్నదని డాక్టర్లు వివరించారు.
సీఎం: ఎక్కడి నుంచి వచ్చినవమ్మా?
మాధవి : మాది కాజీపేట సార్.
సీఎం: ఎన్ని రోజుల కింద షరీకైనవ్?
మాధవి: వారమైతాంది సార్.
సీఎం: మందులు మంచిగ ఇస్తున్నరా?
మాధవి: ఇస్తున్నరు సార్. దగ్గు తక్కువయ్యింది, ఊపిరి బిగపట్టినట్లుగా ఉండేది, ఇప్పుడు మంచిగనే ఉన్నది.
సీఎం: ఏం కాదు, నయమైతది.
సీఎం: ఏం పేరమ్మ?
యాదమ్మ: యాదమ్మ సారు.
సీఎం: డాక్టర్లు మందులు మంచిగ ఇస్తున్నరా?
యాదమ్మ : ఇస్తున్నరు సార్, రోజురోజు
సూదిబుడ్లు ఇస్తున్నరు. ఇప్పుడు పానం అల్కగ ఉన్నది.
సీఎం: ఏం కాదు గుబులు పడొద్దు.
యాదమ్మ: డాక్టర్లు చెప్పిళ్లయ్య. నీకు నయ్య మైతాంది ఇంటికి పోవచ్చని డాక్టర్ చెప్పిండు. జరంత భరోసా వచ్చింది సార్.
సీఎం: ఏం కాదు నీకు. ఇంటికి పోవచ్చు, భయపడకు (ముందుకు నడుస్తూ..)
అన్నోలే.. కొడుకోలే..
కరోనా బాధితులకు కేసీఆర్ పలుకరింపు
జగన్నాథపల్లి, రాయపర్తి మండలం, వరంగల్ రూరల్ జిల్లా
సీఎం: ఆరోగ్యమెట్లుంది?
సుమన్: ఇప్పుడు బాగానే ఉంది సార్.
సీఎం: ఎంజీఎంకు ఎప్పుడు వచ్చావ్?
సుమన్ : ఐదు రోజులు ఐతాంది సార్.
సీఎం: డాక్టర్లు మంచిగ చూస్తున్నరా?
సుమన్: బాగా చూస్తున్నరు సార్. టైంకి మందులు ఇస్తున్నరు.
బాధితుడి భార్య: సార్ మీకు దండం బెడుతా.. మా ఆయనను బతికించండి.
సీఎం: భయపడొద్దు ఏం కాదు, ధైర్యంగా ఉండాలి.
సుమన్: అలాగే సార్ (తలాడిస్తూ)..
సీఎం: ఎన్ని రోజులైతాందమ్మా?
సావిత్రి: వారం ఐతాంది సార్.
సీఎం: ఇప్పుడు ఆరోగ్యమెట్లుంది?
సావిత్రి: బాగయ్యింది సార్. ఊపిరి మంచిగనే అందుతాంది.
సీఎం: గోలీలు ఇస్తుండ్రా?
సావిత్రి : ఏ రోజు గోలీలు ఆ రోజే ఇస్తున్నరు సార్, వాటితోనే మంచిగైతున్న.
సీఎం: ఏం కాదు. భయపడొద్దు.