హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సమాజంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, సమస్యలు ఎదురైనప్పుడు యువత మనోధైర్యంతో వాటిని ఎదుర్కోవాలని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేటలోని ఒక హోటల్లో ‘ఆత్మహత్యల నివారణ-విద్య’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారానే ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు. యువత మనోధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు. ఆత్మహత్యల నివారణకు, యువతలో మనోధైర్యాన్ని పెంపొందించేలా పాఠ్యాంశాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని వివరించారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ జూమ్ యాప్ ద్వారా ప్రారంభించిన సెమినార్లో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మానవ హకుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, వివిధ రంగాల ప్రముఖులు ఆకెళ్ల రాఘవేంద్ర, డాక్టర్ కే ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.