విజ్ఞాన మందిరం… సిద్దిపేట గ్రంథాలయం
రూ.2 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మాణం
9 రకాల ప్రత్యేక విభాగాలు
రాష్ట్రంలో తొలిసారిగా మహిళలకు ‘వనిత’ పేరుతో రీడింగ్ రూమ్
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే డిజిటల్ లైబ్రరీ హాల్
పోటీ పరీక్షల ప్రిపరేషన్, చిన్నారులకు ప్రత్యేక విభాగం
సాహితీ, ఆధ్యాత్మిక, ఉర్దూ పుస్తక ప్రియులకు ప్రత్యేక వేదిక
నేడు ప్రారంభించనున్న ఆర్థిక మంత్రి హరీశ్రావు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 4 : అన్నివర్గాల పాఠక ప్రియుల కోసం.. అత్యాధునిక వసతులతో.. విజ్ఞానాన్ని అందించేందుకు సిద్ధమైంది జిల్లాకేంద్రంలోని నూతన గ్రంథాలయం. రూ.2 కోట్లతో అత్యాధునిక హంగులతో రాష్ర్టానికే మోడల్గా దీనిని నిర్మించారు. నేడు ఈ గ్రంథాలయ భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. తొమ్మిది రకాల ప్రత్యేక విభాగాలు, మహిళలకు ‘వనిత’ రీడింగ్ రూమ్ కొత్తగా ఏర్పాటు చేశారు. డిజిటల్ లైబ్రరీ, సెమినార్ హాల్ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఇందులో కల్పించారు. సిద్దిపేట ప్రజల విజ్ఞాన గనిగా, పుస్తక పూదోటగా ఈ గ్రంథాలయం నిలువనుంది.
విజ్ఞానాన్ని సముపార్జించే దేవాలయాలు గ్రంథాలయాలు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2కోట్లతో అత్యాధునిక హంగులతో రాష్ర్టానికే మోడల్గా సిద్దిపేట జిల్లాకేంద్రంలో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. మనిషికి మంచి పుస్తకం చదివే అలవాటు కంటే గొప్ప అదృష్టం ఏదీ లేదని భావించిన మంత్రి హరీశ్రావు, సిద్దిపేట ప్రజలకు, యువతీయువకులకు, విద్యార్థులకు, సాహితీ, ఆధ్యాత్మిక, ఉర్దూ పుస్తక ప్రియులకు ఉపయోగపడే విధంగా సకల సౌకర్యాలతో గ్రంథాలయ భవనాన్ని తీర్చిదిద్దారు. సోమవారం (నేడు) సిద్దిపేట జిల్లా గ్రంథాలయ భవనాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు.
9 రకాల ప్రత్యేక విభాగాలు.. మహిళలకు ‘వనిత’ రీడింగ్ రూం
సిద్దిపేట గ్రంథాలయానికి ఏండ్ల చరిత్ర ఉంది. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం బైపాస్ రోడ్డు సమీపంలో జీ+1 అంతస్తులతో ఆధునిక గ్రంథాలయ భవనాన్ని నిర్మించింది. జిల్లా కేంద్రంలో నిర్మించిన గ్రంథాలయం భవనంలో అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో 9 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతీయువకులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఒక విభాగం, వృద్ధులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ఒక విభాగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించడం కోసం డిజిటల్ లైబ్రరీ విభాగం, సాహితీ, ఆధ్యాత్మిక ప్రియులకు, ముస్లింల కోసం ఉర్దూ విభాగం, పిల్లలకు చిల్డన్స్ విభాగం, జనరల్, న్యూస్ పేపర్ విభాగాలతో పాటు ప్రత్యేకంగా మహిళల కోసం ‘వనిత’ పేరుతో రీడింగ్ రూంను ఏర్పాటు చేశారు. వీటికి తోడు సెమినార్ హాల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో నూతన గ్రంథాలయ భవనం అందుబాటులోకి వస్తున్నందుకు సిద్దిపేటకు చెందిన కవులు, విద్యావేత్తలు, సాహితీ అభిమానులు, పాఠకులు, యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విజ్ఞాన నిలయం..
సిద్దిపేటలో జిల్లా గ్రంథాలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాం. గతంలో సిద్దిపేట గ్రంథాలయంలో ఇన్ని ప్రత్యేకతలు ఉండేవి కావు. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి కోసం, సాహితీవేత్తలు, మహిళలు, యువత కోసం.. ఇలా అన్నివర్గాల కోసం గ్రంథాలయంలో ఏర్పాట్లు చేశాం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాం. సిద్దిపేట ప్రజల విజ్ఞాన గనిగా, పుస్తక పూదోటగా ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉంటుంది గ్రంథాలయం.
ఇవి కూడా చదవండి
ప్రజాసేవ కోసం.. సినిమాలు వదిలేస్తా: కమల్ హాసన్
శిల్ప కళా వేదిక దగ్గర పవన్ ఫ్యాన్స్ సందోహం.. పాసులు లేకపోతే అంతే..
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!