దమ్ముంటే ఎంపీ స్థానానికి రాజీనామా చెయ్.. నేనూ చేస్తా.. మల్కాజిగిరిలో ఇద్దరం పోటీ చేద్దాం.. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. నేను పాలమ్మి పైకొచ్చాను తప్ప బ్రోకర్ పని చేయలేదు. ప్రతి రూపాయి న్యాయంగా సంపాదించాను. పాలు అమ్మినా, బోర్లు వేయబోయినా, చిట్ఫండ్ కంపెనీలో పనిచేసినా గౌరవంగా బతికా.. రేవంత్రెడ్డిలాగా కబ్జాకోరును కాను. రాజకీయాలకు రాకముందే ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టాను. అప్పటికే 600 ఎకరాల ఆసామిని. భూములను న్యాయబద్ధంగా కొనుగోలు చేశాను. ఎక్కడా అసైన్డ్, దళితుల భూములు ఆక్రమించుకోలేదు.
–మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ‘మల్కాజిగిరి ఎంపీ స్థానానికి దమ్ముంటే రాజీనామా చెయ్.. ఇద్దరం పోటీ చేద్దాం.. నువ్వు గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసినట్టు ఏ రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రుజువుచేస్తే ముక్కు నేలకు రాస్తానని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణభవన్లో మల్లారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పాలమ్మి పైకొచ్చాను తప్ప బ్రోకర్ పని చేయలేదని, ప్రతి రూపాయి న్యాయంగా సంపాదించానని చెప్పారు. పాలు అమ్మినా, బోర్లు వేయబోయినా, చిట్ఫండ్ కంపెనీలో పనిచేసినా గౌరవంగా బతికానని.. రేవంత్రెడ్డిలాగా కబ్జాకోరును కానని, ఆర్టీఐని అడ్డుపెట్టుకొని బ్రోకర్ దందాలు చేయలేదని మండిపడ్డారు. రాజకీయాలకు రాకముందే ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టానని, అప్పటికే 600 ఎకరాల ఆసామినని చెప్పారు. భూములను న్యాయబద్ధంగా కొనుగోలు చేశానని, ఎక్కడా అసైన్డ్, దళితుల భూములు ఆక్రమించుకోలేదని పేర్కొన్నారు. తమ కాలేజీల్లో 10వేల మంది పనిచేస్తున్నారని, లక్షలమంది విద్యార్థులు తనవద్ద ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తయారవుతున్నారని చెప్పారు. సమాజంలో గౌరవంగా ఉండే తనపై ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రేవంత్ కాలుపెట్టిన పార్టీ దివాళా తీయాల్సిందేనని మల్లారెడ్డి ఎద్దేవాచేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి టీడీపీని ఖతం పట్టించారని.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పురాగ దివాళా తీయిస్తారని చెప్పారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమిటో అందరికీ తెలిసిందేనన్నారు. టీఆర్ఎస్ అంటే నమ్మకమైన పార్టీ అని.. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ను దేవుడి లెక్క కొలుస్తున్నారని చెప్పారు. దిక్కూ దివానంలేని పార్టీ అధికారంలోకి వస్తదని రేవంత్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. ఇంకో 20 ఏండ్లు టీఆర్ఎస్దే అధికారమని తేల్చిచెప్పారు. సర్కస్ కంపెనీలెక్క ఓ టెంటు.. పదిమందిని తీస్కపోయి సభలు పెడితే మొనగాడివనుకుంటున్నావా? అని నిలదీశారు. రేవంత్రెడ్డి సభలన్నీ సినిమా డ్రామాలని అన్నారు. రేవంత్రెడ్డి సీఎం అయిపోయినట్టు పోజులు కొడుతున్నారని, రేవంత్ జన్మలో సీఎం కాదు కదా.. కనీసం సినిమాల్లోనూ సీఎం కాలేడని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుచింతలపల్లి గ్రామాన్ని రూ.62 కోట్లతో అభివృద్ధి చేశారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మూడుచింతలపల్లిని మండలంగా మార్చటమే కాకుండా.. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, సైడ్ కాల్వలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి బుడ్డరఖాన్లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఖబడ్దార్ రేవంత్.. నీ బ్రోకర్ మాటలు బంద్ చేయకపోతే చూసుకుందాం ఇగ’ అని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో ఓ కులాన్ని ఆపాదిస్తూ అర్థం వచ్చేలా వాడిన పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. ఆ కులం పదం తన నోటినుంచి పొరపాటున దొర్లినందుకు విచారం వ్యక్తం చేశారు. ఆ కులంవారి మనోభావాలను గాయపరిస్తే తాను బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని పేర్కొన్నారు.