న్యూఢిల్లీ, మే 2: కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కంపెనీ సీఈవో అదర్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు వెంటనే వ్యాక్సిన్ సరఫరా చేయాలని పలువురు ముఖ్యమంత్రులు, వ్యాపారవేత్తలు, ఇతర వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు. తాను ఎదుర్కొన్నవాటిని బెదిరింపులనడం తక్కువే అవుతుందని లండన్లో ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దూషణలు, అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక ఆయన కొన్ని రోజుల కిందట… భారత్ నుంచి వచ్చే విమానాలపై బ్రిటన్ నిషేధం విధించడానికి కొన్ని గంటల ముందు లండన్ వెళ్లిపోయారు. కొన్ని రోజుల్లో భారత్కు తిరిగి వెళతానన్నారు. భారమంతా తన భుజాలపైనే పడుతున్నదని, కానీ తానొక్కడినే ఆ భారాన్ని మోయలేనని పూనావాలా వ్యాఖ్యానించారు. డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసేందుకు ఇతర దేశాల్లో కూడా కొవిషీల్డ్ ఉత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. భారత్లో కరోనా రెండో దశ ఉద్ధృతిపై కుంభమేళా, వివిధ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా… అలాంటి సున్నిత అంశాలకు సమాధానం చెప్పానంటే తన తల నరికేస్తారని ఆయన అన్నారు.