హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి, మళ్లీ లాక్డౌన్ ఉండవచ్చని ఆందోళన పడుతున్న వలస కూలీలను కాపాడుకొనేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. స్వరాష్ర్టాలకు తిరిగి వెళ్లకుండా పనిప్రదేశాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం కరోనా రెట్టింపు తీవ్రతతో విజృంభిస్తుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలోని వలస కూలీల్లో ఆందోళన మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ పెట్టబోమని రాష్ట్రప్రభుత్వం పదేపదే చెప్తున్నా.. వారిలోమాత్రం గతేడాది భయాందోళనలు పోవడం లేదు. ఈ నేపథ్యంలోనే వలస కూలీలను కాపాడుకొనేందుకు ఆయారంగాలవారు ప్రయత్నిస్తున్నారు. యాజమాన్యాలు వారికి అండగా నిలుస్తూ.. భరోసా నింపే చర్యలు చేపడుతున్నారు.
సౌకర్యాలు కల్పిస్తూ.. భరోసా ఇస్తూ
రాష్ట్రవ్యాప్తంగా వివిధరంగాల్లో సుమారు 10 లక్షలమంది దాకా వలసకూలీలు ఉంటారని అంచనా. రైస్ మిల్లలు, భవన నిర్మాణం, హోటళ్లలో పనిచేసేవారు అధికం. మిల్లర్లు, బిల్డర్లు వల సకూలీలు తిరిగి వెళ్లకుండా వారు పనిచేసే ప్రదేశాల్లో వసతి గదులను రెట్టింపు చేస్తున్నారు. ఎవరికైనా కరోనా సోకినట్టు అన్పిస్తే వారిని ప్రత్యేకంగా ఉంచేందుకు ఐసోలేషన్ గదులను నిర్మిస్తున్నారు. ఒకవేళ కరోనా సోకినా, లాక్డౌన్ విధించినా ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బిల్డర్లు, మిల్లర్లు కూలీలకు అవసరమైన కూరగాయలు, బియ్యం సరఫరా చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం
కరోనా నేపథ్యంలో వలస కూలీలు వారి ప్రాంతాలకు వెళ్లకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను అందుబాటులో ఉంచుతున్నాం. నిర్మాణ ప్రాంతాల్లోనే ఐసోలేషన్ గదులను నిర్మిస్తున్నాం. లాక్డౌన్ పరిస్థితులు ఎదురైతే ఉచిత వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తాం. వలస కూలీలను కాపాడుకొనేందుకు డెవలపర్స్ అసోసియేషన్ ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.
వ్యాక్సిన్ వేయించేందుకు ఏర్పాట్లు
రాష్ట్రంలోని మిల్లుల్లో సుమారు లక్షమంది వలసకూలీలు పనిచేస్తున్నారు. కరోనా సమయంలో వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. గదుల సంఖ్య పెంచడంతోపాటు భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. మిల్లుల్లో పని చేసే కూలీలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.