కండ్లముందు కనిపిస్తున్న హరితహారం ఫలాలు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణతోనే భూమిపై జీవకోటి మనుగడ సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి, ఈపీటీఆర్ఐ శనివారం సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతితో జీవకోటికి విడదీయరాని సంబంధం ఉన్నదని అన్నారు. మనిషి ప్రకృతిని కాపాడితే అది అన్ని జీవరాశుల్ని కాపాడుతుందని చెప్పారు. ఈ ఏడాది ‘ప్రకృతిని ఊహించు, సృష్టించు, పునరుద్ధరించు’ అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, దీని లక్ష్యాన్ని సీఎం కేసీఆర్ ఎప్పుడో గుర్తించారని తెలిపారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలని భావించిన సీఎం, ప్రకృతి వనరులను కాపాడేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. హరితహారం ఫలితాలు ఇప్పుడు రాష్ట్రమంతా మన కండ్లముందు కనిపిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఈపీటీఆర్ఐ డీజీ అధర్సిన్హా, పర్యావరణ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నీతూకుమారిప్రసాద్, ఈపీటీఆర్ఐ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల తదితరులు పాల్గొన్నారు.