న్యూఢిల్లీ: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ డాటాకు నిపుణుల కమిటీ ఆమోదం లభించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ డాటా ప్రకారం.. మూడో దశ ట్రయల్స్లో 25,800 వలంటీర్లపై కొవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యం కనబరిచింది. మూడో దశ ప్రయోగాల సమాచారాన్ని ఆ సంస్థ ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు అందజేసింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన కొవిడ్-19 సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) మంగళవారం ఆ సమాచారాన్ని సమీక్షించి ఆమోదం తెలిపింది. మరోవైపు బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థతో ‘ప్రీ-సబ్మిషన్’ సమావేశానికి భారత్ బయోటెక్ హాజరుకానున్నది. డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ వినియోగ జాబితా (ఈయూఎల్)లో చోటు సంపాదించే దిశగా ఈ భేటీ ఒక ముందడుగు అని భావిస్తున్నారు.