హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఆక్సిజన్.. కొవిడ్ మహమ్మారి కారణంగా మనుషుల ఊపిరి నిలిపే ఈ ప్రాణ వాయువు కోసం నిన్నటిదాకా యావత్తు దేశం అల్లాడింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో సరికొత్త ప్రయత్నానికి బీజం పడింది. ఎల్బీనగర్లో కామినేని దవాఖాన ముందున్న ఫ్లైఓవర్ వేదిక అయింది. ఢిల్లీ ఐఐటీ, అమెరికా స్పేస్ సెంటర్ నాసా అధ్యయనం ద్వారా ఆక్సిజన్ అధికంగా అందించే వేల మొక్కలతో ఈ ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కును సిద్ధం చేస్తున్నారు. వీటిమధ్య వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై నడవటం ద్వారా ఫిట్నెస్తోపాటు, స్వచ్ఛమైన ఆక్సిజన్తో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు వీలవుతుంది. రూ.2 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో నిర్మించనున్న ఈ ఆక్సిజన్ పార్కు పనులు ఇటీవలే మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ స్ఫూర్తితో ఈ పార్కు నిర్మాణం జరుగుతున్నదని, ఆగస్టు చివరికి పూర్తి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చెప్పారు.
ఢిల్లీలో అధ్యయనం
ఢిల్లీలోని పహర్పూర్ బిజినెస్ సెంటర్ అనే 50 వేల చదరపు అడుగుల భవనంలో 15 ఏండ్ల క్రితం ఓ ప్రయోగాన్ని చేశారు. ఇండ్ల లోపల పెంచే మనీప్లాంట్లతోపాటు ఆక్సిజన్ను అందించే ఎరికా పామ్, మదర్ ఇన్లా టంగ్ మొక్కలను 1,200 వరకు ఏర్పాటు చేసి 10 గంటల తర్వాత ఆ భవనంలో ఉండేవారి ఆరోగ్య వివరాలపై అధ్యయనం చేశారు. కేవలం ఈ 10 గంటల్లోనే ఆ భవనంలోని 42% మందిలో బ్లడ్ ఆక్సిజన్ 1 శాతం మేరకు పెరిగినట్టు గుర్తించారు. అనంతరం ఈ భవనంలోనివారు ఇతర భవనాల్లోని వారికంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నారన్నదానిపై అధ్యయనం జరిపి ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ వివరాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆ భవనాన్ని ఢిల్లీలోనే అత్యంత ఆరోగ్యకరమైన భవనంగా గుర్తించింది.
ఆక్సిజన్ పార్కు వివరాలు
కామినేని ఫ్లైఓవర్ కింద 0.9 ఎకరాలు.
నాటే మొక్కలు 34,329 (38 రకాలు).
పచ్చిక బయలు విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు.
వాకింగ్ ట్రాక్ పొడవు 734 మీటర్లు
వాకర్లు కూర్చునేందుకు 132 సీట్లు.
పార్కింగ్ సామర్థ్యం 22 కార్లు, 40 టూవీలర్లు
పార్కు ప్రత్యేకతలు
పార్కులోని మొక్కలు దాదాపు 22 గంటలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి.
2.5-3 అడుగుల ఎత్తు పెరిగే మొక్కలతో ఫ్లైఓవర్ కింద ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇవి నీడలో పెరిగే మొక్కలే. ఫ్లైఓవర్ కింద వీటికి నీడ లభిస్తుంది.
ఊపిరితిత్తులు పదిలం
సాధారణంగా 30 ఏండ్ల వయసు పైబడిన వారిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఏడాదికి 30 ఎంఎల్ మేర క్షీణిస్తుంది. ధూమపానం చేసేవారిలో ఈ క్షీణత 100 ఎంఎల్ వరకు ఉంటుంది. ఇలాంటి పార్కులో నడవడం ద్వారా అదనపు తగ్గుదలను నిరోధించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని నిలబెట్టుకోవచ్చు. ఆక్సిజన్ను అధికంగా అందించే మొక్కలతో ఫ్లైఓవర్ కింద పార్కును ఏర్పాటు చేయడం చాలా ప్రయోజనకరం. ఇలాంటి పార్కులు మరిన్ని ఏర్పాటు కావాలి.
మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం
సీఎం కేసీఆర్ తలపెట్టిన హరితహారం స్ఫూర్తితో ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కు నిర్మాణాన్ని చేపట్టాం. నగరంలో లంగ్ స్పేస్ను పెంచాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్కును తీర్చిదిద్దుతాం. రూ.2 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో చేపట్టిన ఈ పార్కు పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ఈ పార్కును అందుబాటులోకి తెస్తాం. ఈ పార్కులో వాకింగ్ చేయడం ద్వారా ప్రజలు స్వచ్ఛమైన ఆక్సిజన్ పొంది ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ధ్యేయం.