హైదరాబాద్ : వరి సాగులో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరి నాటులో వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగు చేస్తే.. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగు చేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని సీఎం అన్నారు. ఈ పద్ధతిలో వరి పంట సాగు చేస్తే ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు (1-2 క్వింటాళ్లు) దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయశాఖపై శనివారం ప్రగతి భవన్లో శనివారం జరిపిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. ఈ పద్దతిలో వరి సాగు చేసే అంశంపై తెలంగాణ రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వరి ధాన్యం విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా బురదలో కాలు పెట్టకుండానే వరి పంట నాటుకోవచ్చన్నారు. నారు పోసే పని లేదు. నారు పీకే పని లేదు. నాటు పెట్టే పని లేదు. కూలీల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. కలుపు కూలీల ఇబ్బంది లేదు. నీటి వినియోగం 30- 35 శాతం తగ్గుతుంది. 10 నుంచి 15 రోజుల ముందే పంట చేతికొస్తుందన్నారు.
మామూలు పద్ధతిలో అయితే ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనపు వడ్లు సరిపోతయి. కాళేశ్వరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగు చేసే రైతులకు ఈ వరి వెదజల్లే పద్ధతి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే రైతులను పిలిచి ఈ విధానం గురించి అధ్యయనం చేసినట్లు సీఎం చెప్పారు. తన సొంత పొలంలో ఈ విధానంలో వరి సాగు చేసి మంచి ఫలితాలను పొందినట్లు తెలిపారు. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు చల్లడానికి యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణలో వరి సాగు చేసే రైతులందరూ ఈ వెదజల్లే పద్దతిని అనుసరిస్తే మంచిదని సీఎం వివరించారు.