హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ‘కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారమవుతున్నాయి. తల్లిదండ్రులారా.. మన పాఠశాలలో 1-5వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. మీ పిల్లలను మా బడిలో చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. రూపాయి ఫీజు కట్టనవసరంలేదు. పుస్తకాలు మేమే ఉచితంగా ఇస్తాం. ఇదే సువర్ణావకాశం. సద్వినియోగం చేసుకోండి’ అంటూ కొత్త అడ్మిషన్ల కోసం ఆటోలో ప్రచారం మొదలుపెట్టారు హైదరాబాద్ జిల్లా సైదాబాద్ మండలంలోని శంకేశ్వర్బజార్ ప్రభుత్వ పాథమిక పాఠశాల టీచర్లు. ఆటోలో మైక్సెట్ పెట్టుకుని బస్తీలు, వాడలను చుట్టేస్తూ పిల్లలకు ఇండ్ల వద్దే అడ్మిషన్ ఫారాలను అందజేస్తున్నారు. బడికి రానవసరంలేకుండా అక్కడిక్కడే అడ్మిషన్లు జారీచేస్తున్నారు. ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన కొనసాగుతుండగా.. 1-5 తరగతుల్లో 286 మంది విద్యార్థులున్నారు. ప్రతిఏటా 150 -200 మంది పిల్లలు కొత్తగా చేరేవారు. కరోనాతో అడ్మిషన్ల సంఖ్య పడిపోతుండటంతో వినూత్నప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 31 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్టు ప్రధానోపాధ్యాయురాలు వీ రేణుక తెలిపారు.