ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా ఈ అనుమానం రావడం సహజమే. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా బాగానే చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే అంతా బాగానే ఉంది కానీ సినిమాలో హీరోయిన్ విషయం మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. 2 నిమిషాలు 9 సెకన్లు నిడివి ఉన్న ట్రైలర్ లో కనీసం ఒక్క క్షణం కూడా హీరోయిన్ శృతి హాసన్ కనిపించలేదు. ఇది చూసిన తర్వాత ఆమె అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అందుకే సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన సినిమాలో అమ్మాయిలకు న్యాయం చేస్తున్నాడు కానీ బయట హీరోయిన్ మాత్రం అన్యాయం చేస్తున్నాడు అంటూ పోస్టులు పెడుతున్నారు.
హీరోయిన్ ను కనీసం ఒక్క షాట్ కూడా చూపించకపోవడం దారుణం అంటూ శృతి హాసన్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ట్రైలర్ లో నివేదా థామస్, అంజలి, అనన్యను అంత సేపు చూపించారు కానీ కావాలనే తమ హీరోయిన్ ను దాచేశారు అంటూ వాళ్ళు మండి పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆమెను ట్రైలర్లో చూపించలేదు.. అంతే తప్ప మరే ఉద్దేశం దర్శక నిర్మాతలకు లేదంటూ సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు అవకాశాలు లేని సమయంలో శృతికి పవన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు.. ఆ విషయం మరచిపోకూడదు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
నిజానికి వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువ నిడివితో ఉంటుంది. మన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ పాత్ర నిడివి ఇంకాస్త పెంచినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో చూపించకపోయినా సినిమాలో ఈమె పాత్ర చాలా బాగుంటుందని.. కచ్చితంగా మంచి పేరు వస్తుంది అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదట్లోనే రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది శృతి హాసన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో వస్తోంది. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.