హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఒక్క క్లిక్తో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం ప్రాజెక్టులు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల డిజిటలైజ్ ప్రక్రియను సంబంధిత ఇంజినీర్ అధికారులు, తెలంగాణ ఐటీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, అటవీశాఖ, జియాలజికల్, హైడ్రాలజీ తదితర శాఖల నుంచి అనుమతులను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి అనేక డాక్యుమెంట్లను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ప్రాజెక్టు డిజైన్, కాలువల నిర్మాణం తదితర అన్నింటితో కలిపి డిటైల్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ ఉంటుంది. భారీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు అయితే ఆయా రాష్ర్టాలతో చేసుకున్న ఒప్పంద పత్రాలు, ట్రిబ్యునల్స్ కేటాయింపులు ఉంటాయి. ప్రస్తుతం వాటిలో చాలావరకు పత్రాలుగానే అందుబాటులో ఉన్నాయి. లక్షల్లో ఉన్న ఆ పత్రాలను భద్రపరచడం, అవసరమైన సమయంలో వాటిని వెదకడం ఇంజినీరింగ్ అధికారులకు భారంగా మారుతున్నది. పురాతన ప్రాజెక్టులకు సంబంధించిన చాలా పత్రాలు పట్టుకుంటే విరిగిపోయే స్థితికి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సాగునీటిశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లనన్నింటినీ డిజిటలైజ్ చేయాలని సంకల్పించింది. 1944 నుంచి ఉన్న సుమారు 5 లక్షల డాక్యుమెంట్లు, 2 వేల బ్లూ ప్రింట్లను నెల రోజుల్లో డిజిటలైజ్ చేయాలని సంకల్పించింది. ఇప్పటికే రెవెన్యూశాఖకు సంబంధించిన పత్రాలను డిజిటలైజ్ చేసిన అనుభవం ఉండడంతో పాటు, అందుకు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతోనే సాగునీటి ప్రాజెక్టులను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం పూనుకున్నది. తెలంగాణ ఐటీశాఖతో కలిసి సాగునీటి శాఖకు చెందిన 40 మందికిపైగా ఇంజినీర్లు డిజిటలైజేషన్ పనిలో నిమగ్నమయ్యారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పరిధికి సంబంధించి కేంద్రం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో ముందుగా అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన పత్రాలను డిజిటలైజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు, సాగునీటి శాఖకు సంబంధించి ముఖ్యమైన పరిపాలన పత్రాలు, జీవోలను కూడా ఆన్లైన్ చేయనున్నారు. ఏ పత్రమైనా ఒక్క క్లిక్తో అందుబాటులోకి వచ్చేవిధంగా చర్యలు చేపడుతున్నారు.