సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మురుగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు రూ.15 కోట్ల వ్యయంతో చేపడుతున్న ట్రంక్లైన్ నిర్మాణ పనులు ఈ నెల చివరికల్లా పూర్తికానున్నాయి. 5.5కిలోమీటర్ల మేర 1200 ఎంఎం సామర్థ్యంతో నిర్మిస్తున్న ట్రంక్లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పెద్దచెరువు, మంత్రాల చెరువు, చందన చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల చుట్టూ వెలిసిన కాలనీలకు చెందిన మురుగునీరంతా నేరుగా చెరువుల్లోకి వచ్చి చేరుతుండటంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చెరువుల సుందరీకరణతో పాటు మురుగునీరు చెరువుల్లో కలువకుండా ఉండేందుకు ట్రంక్ లైన్ను నిర్మిస్తున్నారు. ట్రంక్లైన్ నిర్మాణ పనులు పూర్తయితే మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తుంది.
శివారు ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది భారీ వర్షాల నేపథ్యంలో వరదతో చెరువులు నిండి చుట్టు పక్కల కాలనీలు ముంపునకు గురయ్యారు. ఈసారి సమస్య పునరావృతం కావద్దనే ఉద్దేశంతో చెరువుల సుందరీకరణతో పాటు ట్రంక్లైన్ నిర్మించాలని నిర్ణయించారు. వరదనీరు సాఫీగా మూసీలో కలిసేలా.. హెచ్ఎండీఏ నిధులతో 5.5కిలోమీటర్లు ట్రంక్లైన్ నిర్మిస్తున్నారు. మంత్రి సబితారెడ్డి హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులతో తరచుగా సమీక్షలు జరుపుతూ పనుల్లో వేగం పెంచడంతో ఏడాదిలోపే.. ట్రంక్లైన్ పనులు పూర్తికావచ్చాయి.