హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మంగళవారం పట్టణ ప్రగతిలో 3,377 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేశారు. 140 కొత్త మీటర్లను బిగించారు. 78,577 మొక్కలు నాటారు. 3.76 లక్షలు మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశారు. 530 కిలోమీటర్ల మేర మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. 6,271 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. 2,631 టన్నుల చెత్తను ఎత్తిపోశారు. 1,510 టన్నుల శిథిలాలను, 1,181 కిలోమీటర్ల మేర రోడ్డు పక్కన ఉన్న పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. 1,782 కిలోమీటర్ల మేర మురుగు కాలువల్లో పూడిక తీశారు. 1,512 ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. 182 ట్యాంకులను శుభ్రపరిచారు. 1,248 దళిత బస్తీల్లో అధికారులు పర్యటించి, అక్కడున్న పరిస్థితులపై నివేదికలు తయారుచేశారు.
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్రస్థాయి పంచాయతీరాజ్, మున్సిపల్శాఖ అధికారులు పల్లె,పట్టణబాట పట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ నిజామాబాద్ కార్పొరేషన్లో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. సీడీఎంఏ సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, ఆమన్గల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో పర్యటించారు. పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో పర్యటించి పనులు పరిశీలించారు.
కరోనా కాలంలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్పాల్లో పల్లె ప్రగతిలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే బీజేపీ నాయకులు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
–మోర్తాడ్
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించిన మేడ్చల్ జిల్లా అంకిరెడ్డిపల్లి సర్పంచ్ విమలకు కలెక్టర్ శ్వేతామొహంతి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పల్లెప్రగతికి సంబంధించి ప్రభుత్వ సూచనలు, విధివిధానాలను పాటించలేదని, హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో విఫలమైనందున పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కలెక్టర్ తెలిపారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
పట్టణ ప్రగతితో బాన్సువాడ రూపురేఖలు మారాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని పలు వార్డుల్లో మంగళవారం పర్యటించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని, ప్రజలందరూ పాల్గొని సహకరించాలని కోరారు.
-బాన్సువాడ
పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని.. ఇందులో గుర్తించిన సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ పట్టణ పరిధిలోని సర్ధార్నగర్లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే తప్పని సరిగా పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని సూచించారు. -బడంగ్పేట