సంగారెడ్డి, జూలై 8 : కోర్టుల్లో దీర్ఘకాలికంగా పేరుకుపోతున్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు లోక్అదాలత్లు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో గతేడాది డిసెంబర్లో 1519 కేసులు, 2021 ఏప్రిల్లో 2111 కేసులకు పరిష్కార మార్గం చూపి, సత్వర న్యాయం చేశారు. లోక్ అదాలత్లలో అత్యధికంగా క్రిమినల్ కంపౌండబుల్ 3473 కేసులను పరిష్కరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో రేపు (శనివారం) లోక్ అదాలత్లు ఏర్పాటు చేసి, సత్వర న్యాయం చేసేందుకు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి చర్యలు చేపడుతున్నారు.
ప్రజలు నష్టపోవద్దని..
కోర్టుల్లో కేసులు వేసి, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, మానసికంగా ప్రజలు నష్టపోవద్దనే ఉద్దేశంతో లోక్అదాలత్లలో కేసులు పరిష్కరించుకునేందుకు కక్షిదారులు, వారి న్యాయవాదులకు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్అదాలత్లను ఏర్పాటు చేసి, పెండింగ్ కేసులు, రాజీ కేసులను పరిష్కరించి న్యాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసుల రాజీకి వారం రోజులుగా సంబంధిత అధికారులు, కక్షిదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ లోక్అదాలత్లలో క్రిమినల్ కంపౌండబుల్, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, విద్యుత్, నీటి బిల్లులు, భూసేకరణ పరిహారం, కుటుంబ తగాదాలు, రెవెన్యూ, క్రిమినల్ తదితర కేసులకు పరిష్కారం చూపుతున్నారు. ఇరువర్గాల ఒప్పందం మేరకు తమతమ న్యాయవాదులు కక్షిదారులతో కోర్టులకు సకాలంలో చేరుకొని, న్యాయం పొందాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. రేపు (శనివారం) జరుగనున్న లోక్ అదాలత్లో న్యాయం పొందాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులను విలేకరుల సమావేశంలో సూచించారు.
రాజీయే రాజమార్గం..
కోర్టుల్లో పరిష్కారం కోసం కేసులు వేసి తిరుగుతున్న కక్షిదారులు, రాజీ మార్గంతో కేసులు పరిష్కరించుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని, ఇందుకు న్యాయవాదుల సలహాలు పాటించి రాజీ చేసుకోవడమే ఉత్తమం. అందుకోసమే ప్రజలు, కక్షిదారులకు సత్వర న్యాయం చేసేందుకు లోక్ అదాలత్లు ఏర్పాటు చేసి న్యాయం అందించనున్నారు. చిన్నచిన్న తగాదాలతో కేసులు వేసుకొని, కోర్టుల చుట్టూ తిరగడం కన్నా, ఒకేసారి రాజీ చేసుకుంటే ఏ ఇబ్బందులు తలేత్తవని న్యాయవాదులు సూచిస్తున్నారు. లోక్ అదాలత్లతో ఇరుపక్షాలకు చెందిన కక్షిదారుల పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం పొందవచ్చు. రాజీ మార్గంతో కేసులు తక్షణ పరిష్కారం కావడంతో పాటు పునఃసమీక్షకు, అప్పీలుకు ఆస్కారం ఉండదు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల్లో కక్షిదారులు, ఉభయులు రాజీకి వచ్చి రాజమార్గంలో కేసులు పరిష్కరించుకునే అవకాశం కక్షిదారుల చేతుల్లోనే ఉన్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిష్కారమైన కేసులు..
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న కోర్టుల్లో లోక్ అదాలత్లలో 3630 కేసులు రాజీతో పరిష్కారమయ్యాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన లోక్ అదాలత్లో 1519 కేసులు పరిష్కరించారు. ఇందులో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు 1443, ఎన్ఐ యాక్టు కేసులు 8, వాహన ప్రమాద పరిహారం కేసులు 19, విద్యుత్ బిల్లుల కేసులు 5, కుటుంబ తగాదాలు కేసులు 11, సివిల్ కేసులు 33 ఇరువర్గాల అంగీకారంతో రాజీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు 2030, ఎన్ఐ యాక్టు కేసులు 5, వాహన ప్రమాద పరిహారం కేసులు 5, విద్యుత్ బిల్లులు కేసులు 15, కుటుంబ తగాదాల కేసులు 13, భూసేకరణ పరిహారం కేసులు 2, సివిల్ కేసులు 41 మొత్తం 2111 కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించారు. లోక్ అదాలత్లను వినియోగించుకుని న్యాయం పొందాలని న్యాయమూర్తులు, న్యాయవాదులు కక్షిదాలకు సూచిస్తున్నారు.