మత్స్యపరిశ్రమ అంటే గుర్తొచ్చేది ఏపీలోని కోస్తాప్రాంతం. ఆ ప్రాంతంలో చేపల పెంపకానికి అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. కానీ, నీటి వనరులు అంతగా అందుబాటులో లేని నల్లగొండ జిల్లాలోనూ ఓ రైతు కొర్రమీను చేపల పెంపకం చేపట్టాడు. కొర్రమీను పిల్లల విత్తనంతో కోట్లు గడిస్తున్నాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో పెరిగిన జల సంపద కుల వృత్తులకు ఊతమిస్తున్నది. మత్స్య సంపదను సృష్టిస్తున్నది. ఇటీవల చేపల చెరువుల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. యువత వ్యవసాయంతోపాటు, వ్యవసాయ అనుబంధ రంగాలపై మక్కువ పెంచుకున్నది. ఈ కోవలోనే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెరభీమనపల్లికి చెందిన రైతు కొప్పు విజయ్కుమార్ కొర్రమీను విత్తన చేప పిల్లల ఉత్పత్తితో కొత్త సాగుకి శ్రీకారం చుట్టారు. నాణ్యమైన చేపపిల్లలను దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. మత్స్యకార కుటుంబానికి చెందిన విజయ్ తనకున్న కొద్దిపాటి భూమిలో చేపల పెంపకం చేపట్టాలనుకున్నారు. ఇందుకోసం భువనేశ్వర్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. 2009లో తనకున్న వ్యవసాయభూమిలో కుంటలు తవ్వించి అందులో కొర్రమీను చేపల పెంపకం మొదలుపెట్టారు. 2011లో జాతీయ మత్స్యఅభివృద్ధి బోర్డు అందించిన రూ.7.50 లక్షల ప్రోత్సాహకంతో కొర్రమీను విత్తన పిల్లల పెంపకం చేపట్టారు. నాణ్యమైన పిల్లలను ఉత్పత్తి చేస్తూ.. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రెండెకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కల్చర్ను నేడు ఏడెకరాలకు విస్తరించారు. విడుతలవారీగా చేపపిల్లలను వివిధ ట్యాంకుల్లో పెంచి మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. ఏడాదికి 50 లక్షల నుంచి 60 లక్షల కొర్రమీను విత్తన చేపపిల్లలను ఉత్పత్తి చేస్తూ రూ.2 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు.
చేపల సాగు క్షేత్రంగా తెలంగాణ
చేపల పెంపకం విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను రూపొందించినా అవి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా అధికారుల నుంచి కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారికి ప్రోత్సాహం కనబడుటలేదు. వీటిని అధిగమిస్తే తెలంగాణ చేపపిల్లల ఉత్పత్తి, చేపల సాగు క్షేత్రంగా మారే అవకాశం ఉన్నది. కొర్రమీను చేప పిల్లల ఉత్పత్తికి అవసరమైన గుడ్లు (ఎగ్స్) 24 గంటలు ఉంటాయి. 42 గంటలలో చేప పిల్ల ఉత్పత్తి అవుతుంది. 85 రోజులకు కొరమీను పిల్లలను విక్రయించవచ్చు. ప్రస్తుతం తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాలకు కొర్రమీను పిల్లలను సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం అవకాశం కల్పిస్తే కొరమీను పెంపకంపై అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. – కొప్పు విజయ్కుమార్, చేపల రైతు