సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ సిధారెడ్డి
సార్ స్మారక కవితా సంకలనం ఆవిష్కరణ
కవాడిగూడ, సెప్టెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో సిద్ధాంతకర్తగా నాయకత్వానికి చక్కని మార్గనిర్దేశనం చేసిన గొప్ప దార్శనికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజల గుండెలోతుల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చగలిగారని ప్రశంసించారు. తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్యసాధన ఫౌం డేషన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక కవితా సంకలనాన్ని’ ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, పలువురు కవులు, రచయితలతో కలిసి సిధారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలను సిధారెడ్డి శాలువాలతో సత్కరించారు. తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్ అధ్యక్షతన జరిగిన సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్గౌడ్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, నేటి నిజం పత్రిక సంపాదకుడు బైసా దేవదాస్, ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ చైర్మన్ అశోక్యాదవ్, తెలుగు భాషా చైతన్య సమితి ముఖ్య సలహాదారు ఆళ్ల రామకృష్ణ, హైకోర్టు న్యాయవాది కొంకల జంగయ్య పాల్గొన్నారు.