హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి కోలుకున్నవారిలో ఏర్పడే ప్రతిరక్షకాలు 6 నుంచి 8 నెలలు మాత్రమే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల్లోనే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయని చెప్పింది. ఇవి శరీరంలోకి వచ్చే వైరస్ను నిలువరించగలుగుతాయని పేర్కొన్నది. ఇవి వేరియంట్లను గుర్తించడంలో వెనుకబడుతున్నట్టు గుర్తించామని వివరించింది. తెల్లరక్త కణాల్లోని బీ-సెల్స్, సీడీ4+, సీడీ8+, టీ సెల్స్ ఏ మోతాదులో ఉత్పత్తి అవుతున్నాయో లోతుగా అధ్యయనంచేయాల్సి ఉన్నదని స్పష్టంచేసింది. డబ్ల్యూహెచ్వో గత ఏడాది ఏప్రిల్ 24న ప్రచురించిన ‘కొవిడ్ సమయంలో ఇమ్యూనిటీ పాస్పోర్ట్స్’కు కొనసాగింపుగా తాజా నివేదికను విడుదలచేసింది. ఇందులో కరోనా సోకి కోలుకున్నవారిలో ప్రతిరక్షకాల సామర్థ్యం, జీవనకాలం తదితర అంశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మాదిరిగానే సహజంగా కొవిడ్ సోకి కోలుకున్నవారికి ‘పాస్పోర్ట్’లు జారీచేయడం గురించి మధ్యంతర మార్గదర్శకాలు జారీచేసింది. ఇందులో భాగంగా డబ్ల్యూహెచ్వో బృందం సహజ సంక్రమణ రోగనిరోధకశక్తిపై జరిగిన పలు శాస్త్రీయ పరిశోధనలను, జర్నల్స్లో వచ్చిన వ్యాసాలను, ఆర్టికల్స్ వంటివాటిని పరిశీలించింది.
గుర్తించిన అంశాలు..