శంషాబాద్ రూరల్, జూన్ 2: ఇటీవల కరోనాతో కన్నుమూసిన ప్రైవేటు టీచర్ కుటుంబానికి తోటి ఉపాధ్యాయులు చేయూతనిచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో నవీన్ ప్రైవేటు ఉద్యోగిగా 2016 నుంచి 2020 వరకు విధులు నిర్వహించారు. కరోనాతో ఇటీవల మృతిచెందారు. నవీన్ మృతితో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణుప్రియ ఆధ్వర్యంలో తోటి ఉపాధ్యాయులతోపాటు తెలిసినవారి సహకారంతో నవీన్ భార్య స్వాతికి రూ.65 వేల విలువైన బర్రెను కొనివ్వడంతోపాటు ఇద్దరు పిల్లల పేరిట బ్యాంకులో రూ.30 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు ఉపాధ్యాయులు తెలిపారు. ఉపాధ్యాయులు చేసిన సాయం జీవితంలో మరువలేమని స్వాతి మీడియాతో చెప్పారు.