హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అందించే ఆపత్కాలసాయంలో భాగంగా రెండోవిడుతలో 79 వేల మందికి రూ.2 వేల నగదును అందజేశారు. మొత్తం 83 వేల మంది లబ్ధిదారుల్లో నాలుగువేల మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. 79 వేల మందికి ఈ కుబేర్ ద్వారా బుధవారం నగదు బదిలీచేశారు. ఏప్రిల్ నెల సంబంధించిన రూ.2 వేలను ప్రస్తుతానికి పంపిణీ చేశారు. మే నెల రూ.2 వేల నగదును రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. తొలివిడుతలోని 1.25 లక్షల మంది సహా రెండోవిడుతలోని 79 వేల మందికి మే నెల సహాయాన్ని అందించనున్నారు. ఇందుకుగాను మరో రూ.2 కోట్లను విడుదలచేస్తూ ప్రభుత్వం బుధవారం జీవోను జారీచేసింది. మొత్తంగా రెండు లక్షలకు పైగా లబ్ధ్దిదారులకు మే నెల సహాయాన్ని రెండుమూడు రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నారు. గత నెలలో బియ్యం పొందనివారికి 50 కిలోల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీచేయనున్నారు.