లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ జిల్లాలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా మహిళను ఐదుగురు యువకులు సమీపంలోని పంటచేలల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చిత్రకూట్ జిల్లాలోని భరత్కూప్ పోలీస్స్టేషన్ ఏరియాలో పదిరోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 5న రాత్రి భరత్కూప్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో స్థానిక యువకుడు, అతని నలుగురు స్నేహితులతో కలిసి అదే గ్రామంలో ఒంటిరిగా ఉన్న ఓ 27 ఏండ్ల మహిళ ఇంట్లో చొరబడ్డాడు. అనంతరం అందరూ కలిసి మహిళను ఊరి పక్కనే ఉన్న పంటపొలాల్లోకి లాక్కెళ్లారు. అక్కడ అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పరువు పోతుందన్న కారణంగా బాధితురాలు ఇన్నిరోజులు ఈ విషయాన్ని దాచిపెట్టింది.
అయితే, కుటుంబసభ్యులు ధైర్యం చెప్పడంతో మంగళవారం వారితో కలిసి వెళ్లి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.