హైదరాబాద్, మార్చి 18, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో అత్యంత కీలకమైన శాంతిభద్రతల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. మహిళల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఏర్పాటు చేసిన షీటీమ్స్ మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నదని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 331 షీటీమ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో షీటీమ్స్కు వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారని తెలిపింది. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పౌర సేవల కోసం తెచ్చిన హాక్ఐ మొబైల్ యాప్ను మార్చి 2020 వరకు 31,22,563 మంది పౌరులు డౌన్లోడ్ చేసుకున్నట్టు సర్వే వెల్లడించింది. నిరంతర నిఘా కోసం డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల 59వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. భరోసా కేంద్రాల ఏర్పాటుతో బాధితులకు ఒకేచోట న్యాయ, వైద్య, పోలీస్, పర్సనల్ కౌన్సెలింగ్ వంటి అన్ని సేవలు దక్కుతున్నాయని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది.