జోగులాంబ గద్వాల : అధికారులు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి పై ఫోకస్ పెట్టకుండా అన్ని రోజులు శుభ్రంగా ఉండేటట్లు చూడాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా గద్వాల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామాన్ని సందీప్ కుమార్ సుల్తానియా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు.
2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో ఒక శానిటేషన్ కమిటీ ఉంటుందని అందరూ కూడా దానిపై దృష్టి సారించాలన్నారు. గ్రామంలో సర్పంచ్ పనిచేయక పోతే ప్రశ్నించే తత్వం గ్రామంలో ఉండాలని అప్పుడే గ్రామ అభివృద్ధి సజావుగా ఉంటుందన్నారు. మీ గ్రామం బాగుంటే మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు, చెట్లు దేనికి అనేదానిపై గ్రామస్తులకు వివరించారు. చెట్ల వల్ల కాలుష్యం తగ్గడం, ఆక్సిజన్ పుష్కలంగా అందుతుందని తెలిపారు. హరితహారం లో ప్రతి ఒక్కరు చెట్లను నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శృతి ఓజా, అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, ఎంపీపీ ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు