హైదరాబాద్ : కరోనా వ్యాక్సినేషన్పై కేంద్రానికి విలువైన సూచనలు చేసిన సీఎం కేసీఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడి రాష్ట్ర పరిస్థితులను వివరించారు.
అదేవిధంగా కరోనా సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించి మొదటగా వారికి టీకాలు వేయాల్సిందిగా సూచించారు. ఈ విషయం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లగా పీఎం మోదీ సీఎం కేసీఆర్కు ఫోన్ చేసి మాట్లాడారు. మీ సూచనలు మంత్రి హర్షవర్దన్ తనకు వివరించినట్లు తెలిపారు. మీ ఆలోచనలు, సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుదామన్నారు. సీఎం సూచనలకు ప్రధాని అభినందనలు తెలిపారు.
రాష్ట్రానికి ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు తగినన్ని సరఫరా చేయాలని సీఎం కోరగా ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని పీఎం హామీ ఇచ్చారు.