ఇందల్వాయి, జూలై 28: పూజల పేరిట ప్రజలను మోసం చేస్తూ సుమారు కోటి 60 లక్షలతో ఓ పూజారి ఉడాయించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారం(బీ) గ్రామం లో చోటుచేసుకున్నది. ధర్మారం(బీ)లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ గత కొన్నాళ్లుగా ఆలయానికి వచ్చే మహిళలను టార్గెట్ చేశాడు. ఇండ్లలో ఉండే దోషాల నివారణకు పూజలు చేస్తానని నమ్మించి పెద్ద మొత్తంలో వసూలు చేశాడు. సామూహిక సుమంగళి వ్రతాలు చేయిస్తానని మహిళల వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. పూజారి భక్తుల ఇండ్లకు వెళ్లి పదివేలు పెడితే రూ.12వేలు, రూ.15వేలు పెడితే రూ.20 వేలు ఇవ్వడంతో మహిళలు గుడ్డిగా నమ్మారు. ఇలా సుమారుగా రూ.కోటి 60 లక్షల వరకు వసూలు చేసి కనిపించకుండా పోయాడు. స్థానికులే కాకుండా జిల్లాలోని నందిపేట్ మండలం, బోధన్, నిజామాబాద్ నగరంతోపాటు అనేక చోట్ల మహిళలు శ్రీనివాస్ శర్మకు డబ్బులు ముట్టజెప్పారు. చివరకు అందరి దగ్గర వసూలు చేసి పరారయ్యాడు. పూజారికి డబ్బులు చెల్లించి మోసపోయిన బాధితులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.