పండుగ సీజన్లో 5 శాతం వరకు పెరుగనున్న ధరలు
న్యూఢిల్లీ, మే 4: టీవీ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశీయ తయారీదారులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో ఇదివరకే ధరలు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే పండుగ సీజన్ నాటికి వీటి ధరలను 3 నుంచి 5 శాతం వరకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒపెన్-సెల్ ప్యానెళ్ళపై దిగుమతి సుంకం కేంద్ర ప్రభుత్వం పెంచడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకోనున్న ఈ నిర్ణయంతో ఈ ఏడాది రెండో అర్థభాగం నాటికి టీవీలు మరింత ప్రియంకాబోతున్నాయి. ఈ ఒపెన్-సెల్ ప్యానెళ్ళను చైనా నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా టీవీల తయారీలో వీటిని వినియోగిస్తున్నారు. వచ్చే మూడేండ్ల కాలంలో దిగుమతి సుంకాన్ని 10-12 శాతం వరకు పెంచబోతున్నది కేంద్రం. ప్రస్తుతం వీటిపై 5 శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు.
సెల్-ప్యానెళ్ళ తయారీకి సత్తా లేదు..
టీవీల్లో అత్యంత కీలకమైన సెల్-ప్యానెళ్ళను దేశీయంగా తయారు చేసే సంస్థలేవి లేకపోవడంతో విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైనా నుంచి అత్యధికంగా ప్యానెళ్ళు దిగుమతి అవుతుండటం కేంద్రం కలవరానికి గురి చేస్తున్నది. చైనా దిగుమతులకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. దిగుమతులకు చెక్ పెట్టడానికి సుంకాన్ని దీర్ఘకాలికంగా 5 శాతం నుంచి 12 శాతానికి పెంచుతామని ఇదివరకే నరేంద్ర మోదీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే జనవరి, ఏప్రిల్ నెలలో టీవీల ధరలను పెంచిన సంస్థలు..వచ్చే అక్టోబర్ నాటికి మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. గత నెలలో టీవీల ధరలు 30 శాతం వరకు అధికమయ్యాయి. గడిచిన రెండేండ్లుగా టీవీ ఇండస్ట్రీ తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కుదుటపడితేనే ఈ రంగానికి ఊపిరి లభించినట్లు అవుతున్నదని ముంబైకి చెందిన ఒక డీలర్ పేర్కొన్నారు.
జీఎస్టీ రేటును తగ్గించాలి..
టీవీల పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకావాలంటే జీఎస్టీ రేటు నైనా తగ్గించాలి..ఒపెన్ సెల్స్పై విధిస్తున్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేయాలని ఇండస్ట్రీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతీయ సైనికులపై చైనాకు చెందిన కొందరు దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితలు నెలకొన్నాయి.