నర్సంపేట, మే 20 : లాక్డౌన్ను మరింత కఠినతరం చేశారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అకారణంగా రోడ్లపైకి వచ్చే వారిని పట్టుకుని వాహనాలు సీజ్ చేస్తున్నారు. నర్సంపేటలో పోలీసులు 25 వాహనాలను సీజ్ చేశారు. మరికొన్ని వాహనాలకు జరిమానాలు విధించారు. నర్సంపేట ఏసీపీ ఫణిందర్, డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్, ట్రైనీ ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బంది రోడ్ల మీద తనిఖీలు చేస్తున్నారు. కాగా, లాక్డౌన్ విరామ సమయంలో వాహనాలు ఒకే సారి బయటకు రావడంతో గురువారం నర్సంపేటలో ట్రాఫిక్ స్తంభించి పోయింది.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండలంలో ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నెక్కొండ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. 30 మంది వాహనదారులకు జరిమానా విధించారు. ఎస్సై వెంట ట్రైనీ ఎస్సై మహేందర్, కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్, రాము ఉన్నారు.
ఊరుగొండ వద్ద..
దామెర : లాక్డౌన్ సమయంలో అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని పరకాల ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై ఊరుగొండ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.