కలెక్టర్ శశాంక
కరోనా వైద్యసేవలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కరోనా రోగులకు అందుతున్న సేవల పర్యవేక్షణకు, సమన్వయం చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కరోనా సేవలు, ఆక్సిజన్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, వ్యాక్సినేషన్పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కరోనా రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు వైద్యులను సమన్వయం చేసుకుంటూ సేవలందించేందుకుజిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్ను సమన్వయ అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకునేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్, అర్బన్ తహసీల్దార్ సుధాకర్ను కో ఆర్డినేటింగ్ అధికారులుగా నియమించినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, మందుల సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్కు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రైవేట్ దవాఖాన్లలో రెమ్డిసివిర్ ఇంజక్షన్, ఆక్సిజన్, బెడ్లకు కృత్రిమ కొరత సృష్టించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ దవాఖాన్లలో ఖాళీ బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానలో శానిటేషన్ మెరుగుపర్చాలని ఆర్ఎంవోను ఆదేశించారు.
దవాఖాన్లలో కరోనా రోగులకు నాణ్యమైన సేవలందించాలన్నారు. దవాఖానలో సిబ్బంది అందరికీ విధులు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన దవాఖానలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ రత్నమాలను ఆదేశించారు. దవాఖానలో వార్డుల్లో ఖాళీ బెడ్ల వివరాలను బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. జిల్లాలోని స్పెషలిస్ట్ వైద్యులను కరోనా సేవలకు పంపించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. కరోనా పాజిటివ్ ఉన్నవారందరినీ ఐసొలేషన్లో ఉంచేందుకు కరోనా కిట్లు పంపించాలని, జిల్లా స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో 20 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇచ్చేలా చూడాలన్నారు.
ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోని జిల్లాలోని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్శాఖల ఫ్రంట్లైన్ వారియర్లందరికీ టీకాలు వేయించాలన్నారు. తీసుకోని వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ దవాఖాన్లలో కరోనా చికిత్స పొంది ఆరోగ్యం మెరుగైన వారిని డిశ్చార్జి చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రత్యే క పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్లో జిల్లా ఇన్చార్జి వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జువేరియా, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, ఆర్ఎంవో శౌరయ్య, జడ్పీ సీఈవో రమేశ్, డీపీవో వీరబుచ్చయ్య, మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, సహకార అధికారి మనోజ్కుమార్, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్కుమార్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ సుధాకర్, డాక్టర్ అలీం, డాక్టర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.