జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అమీనాపూర్లో వృద్ధదంపతులు ఉన్నారు. భర్త వయసు 85. భార్య వయసు 70. ఈ మధ్య భార్య ఆరోగ్యం క్షీణించటంతో జనగామ ఏరియా దవాఖానలో చేర్పించాడు భర్త. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం వేరే దవాఖానకు తీసుకొనివెళ్లాలని వైద్యులు సూచించారు. తాను ముసలివాడినైపోయానని, కొడుకు పట్టించుకోవటం లేదని చెప్పటంతో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ సీడీపీవో, సూపర్వైజర్ వాళ్ల కొడుకుకు కౌన్సెలింగ్ ఇచ్చి తప్పు తెలుసుకొనేలా చేశారు. దీంతో ఆ కొడుకు తన తల్లిని సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం చేయించాడు.
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): కడుపున పుట్టినవాళ్లు కాదుపొమ్మంటే ఆ ముసలోల్లను సర్కారే ఆశ్రయమిచ్చి కాపాడుతున్నది. ఇంట్లోంచి గెంటేసిన కొడుకుల ముక్కుపిండి పట్టి మెయింటెనెన్స్ వసూలు చేసి తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నది. జీవిత చరమాంకంలో అనాథలుగా, అభాగ్యులుగా, ఆలనాపాలనా లేక అవస్థలు పడుతున్న వేలాది మందికి వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ సేవ చేస్తున్నది. ‘ఎల్డర్లైన్’ ద్వారా రెండేండ్లలోనే దాదాపు 5వేల పైచిలుకు మందికి ఆత్మీయ స్పర్శ అందించింది. కరోనా ప్రభావాన్ని మొదట్లోనే గుర్తించిన రాష్ట్ర సర్కారు నిరాశ్రయులు, అభాగ్యులైన వృద్ధులను ఆదుకోవాలని సంబంధితశాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, వికలాంగుల శాఖ ఎల్డర్లైన్ ద్వారా 14567 టోల్ఫ్రీ నంబరును ఏర్పాటుచేసింది. ఫోన్కాల్స్ ద్వారా విజ్ఞప్తులు, సోషల్ మీడియా ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ వృద్ధులకు పాదసేవ చేస్తున్నది. ఆయా జిల్లాల సంక్షేమశాఖ, పోలీసు, రెవెన్యూ, స్త్రీ, శిశు సంక్షేమం, ఎన్జీవోలను సమన్వయం చేస్తూ ముసలోళ్లకు కావలిగా ఉంటున్నది. నిత్యావసర వస్తువులు అందజేస్తున్నది, న్యాయసేవలు కల్పిస్తున్నది. కన్నోళ్లపట్ల కఠినంగా ఉండే 10 మంది కొడుకులకు బుద్ధి చెప్పింది. దిక్కూలేని 302 మందిని రక్షిచింది. 282 మందిని వృద్ధాశ్రమాల్లో చేర్పించింది. ఎంతోమందికి వ్యాక్సినేషన్ వేయించింది.
సేవలు వృద్ధులు
కొవిడ్సేవ 1,148
పిల్లలు తిట్టారని 309
రెస్క్యూ 302
వృద్ధాశ్రమాల్లో చేరినవారు 282
న్యాయసలహాలు పొందినవారు 363
మెయింటెనెన్స్ అందుకొన్నవారు 10
ఎమోషనల్ సపోర్ట్ 45
నిత్యావసర సరుకులు 2,345
వ్యాక్సినేషన్ 510
మొత్తం 5,314
మంత్రి కేటీఆర్ ట్వీట్
రంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఓఆర్ఆర్ సమీపంలో ఒక వృద్ధురాలు 15 రోజులుగా ఉంటుందని, ఆమె తన వివరాలు చెప్పటం లేదని, ఆమెను ఆదుకోవాలని పవన్కుమార్ కందుకూరు అనే యువకుడు పురపాలన, ఐటీశాఖల మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశాడు. స్పందించిన మంత్రి వెంటనే ట్వీట్ను
శిశుసంక్షేమశాఖకు ట్యాగ్ చేశారు. అప్రమత్తమైన జిల్లాసంక్షేమశాఖ అధికారులు ఘటనాస్థలికి వెళ్లి ఆమెకు ఎవరూ లేరని గ్రహించి వృద్ధాశ్రమంలో చేర్పించారు.