మహబూబ్నగర్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని విధంగా గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసి వాటిని విజయవంతంగా కొండకోనల్లో వెదజల్లి రికార్డు సృష్టించిన పాలమూరు మహిళా సంఘాల సభ్యులు ఈ ఏడాది ఏకంగా 2.08 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ను వెదజల్లే కార్యక్రమాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్గౌడ్, గ్రీన్ చాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు జిల్లా మహిళా సమాఖ్య ఈ రికార్డు కోసం దరఖాస్తు చేసింది.